Union Budget 2025:భారత్లో ఎలక్ట్రిక్ మార్కెట్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లిథియం బ్యాటరీలు, సంబంధిత రంగాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్లో గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించారు. స్థానిక తయారీని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎలక్ట్రానిక్స్ను మరింత సరసమైనవిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
లోక్సభలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కోబాల్డ్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, లెడ్, జింక్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజ పదార్థాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD)ని తొలగించింది. ఈ మినరల్స్ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాల (రెన్యూవబుల్ ఎనర్జీ డివైజెస్) తయారీలో కీలకంగా ఉంటాయి. ఇప్పుడు వీటిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తొలగించడంతో ఈ మెటీరియల్స్పై ఆధారపడిన EVలు, క్లీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల తయారీ ఖర్చు తగ్గనుంది.
వీటితో పాటు EV బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి ఉపయోగపడే 28 రకాల వస్తువులను సుంకం రహితంగా చేశారు. ఈ మినహాయింపుతో కంపెనీలు బ్యాటరీ ప్రొడక్షన్కు అవసరమైన మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు, క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు, దిగుమతి చేసుకున్న ప్రీమియం కార్లు, మోటార్ సైకిళ్లు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి.