తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 8:01 PM IST

ETV Bharat / technology

మనిషి మెదడులో చిప్‌- ఆపరేషన్​ సక్సెస్!​- ఎలా పని చేస్తుందంటే?

Neuralink Implant Human : ఎలాన్‌ మస్క్‌ ప్రారంభించిన న్యూరాలింక్‌ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ సాంకేతికతను మానవులపై తొలిసారి న్యూరాలింక్‌ శాస్త్రవేత్తలు ప్రయోగించారు. న్యూరాలింక్‌ చిప్‌ను మానవ మెదడుకు విజయవంతంగా అనుసంధానించారు. ఈ ప్రయోగంలో ఫలితాలు కూడా సంతృప్తికరంగా వచ్చినట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రమాదాలు లేదా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై అచేతనంగా మారిన వారికి పునర్జన్మ ప్రసాదించినట్లే అవుతుందని మస్క్‌ చెబుతున్నారు.

Neuralink Implant Human
Neuralink Implant Human

Neuralink Implant Human :నాడీ సంబంధిత వ్యాధిగ్రస్తులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై కమ్యూనికేషన్‌ సామర్థ్యం కోల్పోయిన వ్యక్తులు సాధారణ జీవనం గడిపే రోజులు దగ్గరిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అధునాతన కార్ల తయారీ సహా నాసాను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన రాకెట్ల తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వ్యాపార దిగ్గజం ఎలాన్‌మస్క్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు న్యూరాలింక్‌లో కీలక ముందడుగు పడింది. న్యూరాలింక్‌ శాస్త్రవేత్తలు మెదడుకు అనుసంధానించే చిప్‌ను విజయవంతంగా మనిషిపై ప్రయోగించినట్లు మస్క్‌ స్వయంగా వెల్లడించారు.

గతంలో స్విస్ వైద్యులు సైకిల్‌ యాక్సిటెండ్‌లో పక్షవాతానికి గురైన గెర్ట్‌జాన్ ఓస్కామ్‌ అనే వ్యక్తిని మళ్లీ నడిపించేందుకు ఆయన మెదడులో చిప్‌ ఇంప్లాంట్‌ చేశారు. న్యూరో సైంటిస్ట్‌లు దెబ్బతిన్న అతడి మెదడు, వెన్నెముక మధ్య వైర్‌లెస్ కనెక్షన్‌ను ఏర్పాటుచేశారు. మెదడు సంకేతాలను ఏఐ అల్గారిథమ్ ద్వారా అన్వయించి వెన్నుముకకు పంపేలా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ వ్యక్తి 12 ఏళ్ల తర్వాత తిరిగి నడవగలిగాడు. ప్రమాదాల కారణంగా పూర్తిగా మాట పడిపోయిన వ్యక్తులూ తమ భావాలను ఈ చిప్‌ సాయంతో పంచుకోగలరు. మెదడు ఆలోచనలు, చిప్‌ ద్వారా వైర్‌లెస్‌గా కంప్యూటర్లు, ఫోన్లకు అందుతాయి. కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు ఆ భావాలను డీకోడ్‌ చేసి అక్షరాల రూపంలో మనకు స్క్రీన్‌పై కనిపించేలా చేస్తాయి.

మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా సంకేతాలను అందిస్తుంది. కణాలు పరస్పరం అనుసంధానమై ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్లు అనే రసాయన సంకేతాలతో కణాల మధ్య కమ్యూనికేషన్‌ జరుగుతుంది. ఈ ప్రక్రియలో విద్యుత్‌ క్షేత్రం ఏర్పడుతుంది. న్యూరాన్లకు దగ్గరగా చిప్‌ ద్వారా ఉంచిన ఎలక్ట్రోడ్లు రికార్డు చేసిన విద్యుత్‌ సంకేతాలను డీకోడ్‌ చేసి యంత్రాలను, శరీరంలోని నిర్దిష్ట అవయవాలను నియంత్రించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వారు తమ మెదడు ద్వారా సంకేతాలను పంపొచ్చు.

ఈ ప్రయోగంలో ముందుగా సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 చిప్‌ను అమరుస్తారు. సన్నని వైర్లను నేరుగా మెదడులోని నాడులకు అనుసంధానిస్తారు. చిప్‌ను సురక్షితంగా కచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్‌ ఓ రోబోను తయారు చేసింది. దాని సాయంతోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. చిప్‌లో బ్యాటరీ వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జ్‌ అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details