Woman Suicide and Dharna Was Held Family Members :తమ బిడ్డను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దివ్య, శివకు 14నెలల క్రితం వివాహం కాగా ఆరు నెలల పాప ఉంది. వీరు హయత్నగర్లోని బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు.
మంగళవారం రాత్రి దివ్య చనిపోయింది. భర్త శివ, అత్త కుటుంబ సభ్యులే దివ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పెద్దఎత్తున హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో విజయవాడ జాతీయ రహదారీపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న శివపై బాధిత కుటుంబీకులు స్టేషన్ లోపలికి వెళ్లి దాడి చేశారు. వారిని ఆపేందుకు ప్రయత్నించిన పలువురు సిబ్బందిపై కూడా దాడి చేశారు. హయత్ నగర్ సీఐ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.