Lavanya in Narsingi Police station : డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య మరోసారి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్స్టేషన్కు వెళ్లారు. శేఖర్ బాషాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రయత్నిస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. తన వద్ద మొబైల్లో ఉన్న ఆడియో సంబంధిత ఆధారాలను పోలీసులకు ఆమె అందజేశారు. 140 గ్రాముల డ్రగ్స్ను తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు తనపై కుట్ర చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వందకు పైగా మహిళల వీడియోలు : అభ్యంతరకర వీడియోల కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మస్తాన్సాయి వద్ద వందకు పైగా మహిళల వీడియోలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసేందుకు యత్నించిన మహిళలను మస్తాన్సాయి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మస్తాన్సాయి వీడియో కాల్స్ చేశాడు.
వంద మందికి పైగా మహిళలను మస్తాన్ మోసగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యంతరకర వీడియోలతో మహిళలను మస్తాన్సాయి బ్లాక్మెయిల్ చేసినట్లు తేల్చారు. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు మహిళలు, యువతులను అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్సాయిని మళ్లీ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. మస్తాన్సాయి బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
రాజ్ తరుణ్ కేసుతో బయటపడ్డ మస్తాన్ సాయి : మస్తాన్సాయి యువతులు, వివాహితలకు డ్రగ్స్ ఇచ్చి, లైంగికపరమైన కోరికలు తీర్చుకుంటూ వీడియోలను షూట్ చేస్తున్నాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. గతంలో మస్తాన్సాయి హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సినీ నటుడు రాజ్తరుణ్ తనను పెళ్లి పేరిట మోసం చేశాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి వ్యవహారం బయట పడింది. లావణ్య రెండు డ్రగ్స్ కేసుల్లోనూ నిందితురాలిగా ఉన్నారు.
మస్తాన్ సాయి అరాచకాలు : యువతులను ట్రాప్ చేసి వారి నగ్న వీడియోలు రికార్డ్ చేయడం, వాటిని బాధితులకు చూపించి బెదిరించి తన ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడటం, ఒక వేళ ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం. ఇదీ మస్తాన్ సాయి చీకటి బాగోతం. దీంతో పాటు డ్రగ్స్ సేవించడం, విక్రయించడం కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాలేజీ రోజుల్లోనే డ్రగ్స్ : ఏపీలోని గుంటూరు జిల్లా నల్ల చెరువుకి చెందిన మస్తాన్ సాయి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఇంజినీరింగ్ చదివే సమయంలోనే డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు-హైదరాబాద్ మధ్య తిరుగుతూ సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నాడు. మస్తాన్ సాయిపై 2023 సెప్టెంబరులో రాజేంద్రనగర్ ఎస్వోటీ, మోకిల పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో అరెస్టు చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. ఆ కేసులో మస్తాన్ సాయి ఏ4గా ఉన్నాడు.
హీరో రాజ్తరుణ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ - మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు