Woman Murder Case In Medchal: సెల్ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్న పాటి గొడవ మహిళ హత్యకు దారి చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈ నెల 23న దుండిగల్ తండాలో శాంతి అనే మహిళను హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మహిళను హత్య చేసిన సూపర్వైజర్ కమల్ కుమార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరిలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ జిల్లా డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండిగల్ తండా-2కు చెందిన జె.శాంతి (45) బెల్ట్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె. భర్త ఇది వరకే చనిపోగా ఒంటరిగా ఉంటోంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ (37) ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సూపర్ వైజర్గా పని చేస్తూ ఆమె ఇంటి పక్కనే నెల రోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 23న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ, నీవు తీసావా అంటూ శాంతితో గొడవపడ్డాడు. ఛార్జర్ విషయంలో శాంతి ఛార్జర్ లేదంటూ వాగ్వాదానికి దిగింది. మృతురాలు శాంతి అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో నిందితుడు కమల్ కుమార్ విచక్షణారహితంగా శాంతిపై దాడి చేశాడు.
మద్యం మత్తులో ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దాంతో ఆమె అరవడంతో నోరు, ముక్కు మూయడంతో ఊపిరాడక చనిపోయింది. అనంతరం నిందితుడు సొంతూరుకు పారిపోయాడు. ఈ మేరకు ఈ నెల 24న మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ నెల 25న గాగిల్లాపూర్లో కమల్ కుమార్ను అరెస్ట్ చేశారు. విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ స్పష్టం చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.