తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యాభర్తలుగా విడిపోయినా మోసం చేయడంలో మాత్రం కలిసే - నిరుద్యోగుల నుంచి లక్షలు దోచుకున్న మాజీలు

బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్న మాజీ భార్యాభర్తలు - మాజీ భార్యను అరెస్టు చేసిన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు - పరారీలో మాజీ భర్త

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

WOMAN AND X HUSBAND JOB FRAUD
Woman and her Ex Husband Job Fraud in Hyderabad (ETV Bharat)

Woman and her Ex Husband Job Fraud in Hyderabad : ఆ దంపతులు విడిపోయినా మోసం చేయడంలో మాత్రం కలిసే ఉన్నారు. బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్నారు ఈ మాజీ భార్యాభర్తలు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు చెందిన నిరుద్యోగులే లక్ష్యంగా వీరి దోపిడి జరుగుతుంది. మోసం చేసి నిరుద్యోగుల జీవితాలను నిలువునా ముంచేశారు. సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు ఆ కిలాడీ ఆటకట్టించగా, మాజీ భర్త పరారీలో ఉన్నాడు.

కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అలీ, రేష్మ అలియాస్‌ స్వప్న 2009లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇన్‌స్టాంట్‌ ఐటీ జాబ్స్‌ కన్సల్టెన్సీలో అలీ మేనేజర్‌గా రేష్మ టెలీకాలర్‌గా పనిచేసేవారు. 2013లో వీరిద్దరూ వివాహం చేసుకుని 2022లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగాల నియామక ప్రక్రియ మీద అవగాహన పెంచుకున్నారు. దీంతో జాబ్‌ ఆఫర్స్‌ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేయాలని పథకం వేశారు. విడాకుల తర్వాత రేష్మ మరొకర్ని పెళ్లాడినా మాజీ భర్తతో సంబంధాలు కొనసాగిస్తోంది. అతడితో కలిసి మోసాలకు పాల్పడుతోంది.

వివిధ వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలు సేకరించింది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థలో మానవ వనరుల విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నానని, బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు కాల్స్‌ చేసేది. ఉద్యోగం కావాలనుకుంటే అడ్వాన్సు కింద కొంత మొత్తం ఇవ్వాలని చెప్పేది. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం వచ్చినట్లుగా ఐబీఎం, కాగ్నిజెంట్‌ పేర్లతో ఉన్న మెయిల్‌ఐడీల ద్వారా నియామకపత్రం పంపించేవారు. ఆ తర్వాత కనిపించకుండాపోవడం పరిపాఠిగా మారింది. ఈ ఏడాది ఆగస్టులో ఎంబీఏ పూర్తి చేసిన యువతితో పాటు మరికొందర్నీ రేష్మ ఇలాగే మోసగించింది.

10 మంది దగ్గర నుంచి రూ. 58.75 లక్షలు వసూలు :హైదరాబాద్‌కు చెందిన యువతికి కాల్‌ చేసి ఐబీఎం, కాగ్నిజెంట్‌లో భారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారని నమ్మించింది. నిజమేనని నమ్మిన యువతి తనకు తెలిసిన వారికి ఈ విషయం చెప్పింది. మొత్తం 10 మంది దగ్గర రూ.58.75 లక్షలు వసూలు చేసి నియామక పత్రాలు ఇచ్చింది. అయితే అవి నిజం కాదని తెలుసుకున్న బాధితులు ఫోన్‌ చేస్తే స్పందన లేకుండా పోయింది. అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఇన్‌స్పెక్టర్‌ పి.నరేంద్ర బృందం, కర్ణాటకలోని కలబుర్గిలో రేష్మ ఉంటున్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతా, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితురాలు రేష్మను అరెస్టు చేశారు.

నిందితురాలి నుంచి 15 ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 10 సిమ్‌కార్డులు, ఆరు చెక్‌బుక్‌లు, ఒక కారు, డెబిట్, క్రెడిట్‌కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై మూడు రాష్ట్రాల్లో 13 కేసులున్నాయి. కాగా రేష్మతో పాటు మోసాలకు పా‌ల్పడ్డ ఆమె మాజీ భర్త మహ్మద్‌ అలీ పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి మాటలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే డయల్‌ హండ్రెడ్‌ లేదా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

గవర్నమెంట్​ జాబ్​ పేరిట నిరుద్యోగులకు వల - రూ.60 లక్షలకు కుచ్చుటోపీ - Jobs Fraud in Jayashankar Bhupalpal

పార్ట్​ టైమ్ జాబ్స్​ పేరిట మీకూ ఇలాంటి వాట్సాప్ కాల్స్ వచ్చాయా? - అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే - Part Time Job Scam in hyderabad

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details