Vyjayanthi Book Launch Event :"వైజయంతి" – 'జగన్నాథ పండితరాయలు' నవలపై ప్రముఖుల అభిప్రాయాల సమాలోచనా గ్రంథావిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. 11వ తేదీన రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుధామ సృజనకర్తగా విహారి సంపాదకత్వంలో తీర్చిదిద్దిన 'సప్తశతి' (సప్తపదుల కవితా సంకలనం) తో పాటు, విహారి స్వయంగా రచించిన 'జగన్నాథ పండితరాయలు' చారిత్రక నవలపై సమాలోచన గ్రంథం 'వైజయంతి'ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ మాజీ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కె.వి.రమణాచారి ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
యాభై ఏళ్ల తపస్సు :పుస్తకాల ఆవిష్కరణ అనంతరం విశ్రాంత ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ 'జగన్నాథ పండితరాయలు' నవల ఊహాత్మకమే అయినప్పటికీ ప్రసిద్ధ కవి, రచయిత శ్రీ విహారి (జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి) యాభై ఏళ్లు చరిత్రని శోధించి రాశారని ప్రశంసించారు.
"సాహిత్యంలో స్వేచ్ఛగా విహరించే కథారాజు మా విహారి అని నేను అంటుంటాను. ‘జగన్నాథ పండితరాయలు’ నవల సాహితీ లోకంలో విహరిస్తూనే ఉంటుంది." – కేవీ రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు
తానూ పదేళ్లు ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు సలహాదారుగా ఉన్నానని రమణాచారి గుర్తు చేసుకున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ సలహాదారుగా ఉండటమంటే పాముతో చెలగాటమాడినట్లేనని, పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లుగా ఉంటుందన్నారు. సలహాదారుగా చాలా ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుందని వ్యక్తీకరించారు.
తెలుగువాడైన జగన్నాథుడు 17వ శతాబ్దంలో తాను బ్రాహ్మణుడై కూడా, మొఘల్ చక్రవరి జహంగీర్ వద్ద సలహాదారుగా ఉండి 'పండితరాయలు' అని బిరుదు పొందారని రమణాచారి కీర్తించారు. జహంగీర్ కంటే ఆయన భార్య నూర్జహాన్ జగన్నాథరాయలును గౌరవించేవారని, మహారాణి అయినప్పటికీ ఆయన మాటలు శిరసావహించేవారన్నారు.