Victims Their Grief Over Irregularities in Contract Jobs: వైఎస్సార్ జిల్లాలో ఒప్పంద ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరగడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిపై వేటువేసి అర్హత లేని వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయడంపై బాధితులు మండిపడ్డారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాన్సర్ కేర్ సెంటర్, మెంటల్ ఆసుపత్రి, పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగాల భర్తీలో భారీగా అవకతవకలు జరిగాయని బాధితులు అంటున్నారు. బాధితులు కడప రిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఆయా ఆసుప్రతుల్లో ఉన్న ల్యాబెక్నీషియన్, రేడియాలజీ, ఈసీజీ తదితర 26 విభాగాల్లో దాదాపు 208 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకాల ఖాళీలను భర్తీ చేసేందుకు డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని మెడికల్ కళాశాల ఏవో, సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపల్ పరిశీలించి అర్హతలు, ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. కానీ ఎలాంటి అర్హత లేని వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
'ఖేలో ఇండియా' విజేతలకు గుడ్న్యూస్- ప్రభుత్వ ఉద్యోగాలకు వారంతా ఎలిజిబుల్!
కొంతమంది అధికారులు, కళాశాలలో అనాటమీ, పెథాలజీ విభాగంలో పనిచేసే కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు చేతివాటం చూపించి అనర్హులకు చోటు కల్పించారు. తొలుత ప్రొవిజనల్, ప్రతిభ జాబితా ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉండగా దానిని పక్కన పెట్టి నేరుగా తుది జాబితా విడుదల చేసేశారు. ప్రతిభ జాబితాలో ఒకటో స్థానంలో ఉన్న వారికి కాకుండా 20వ స్థానంలో ఉన్న వారికి, స్థానికేతరులకు అవకాశం కల్పించారు. ఇతర జిల్లాలలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరిగిందన్నారు. కేవలం సీఎం సొంత జిల్లాలోనే అవకతవకలకు పాల్పడటం పట్ల నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బాధితులు తెలిపారు.