తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టుకే కాదు - చావులోనూ నీతో నేను - ఒకేసారి కవలల దుర్మరణం

రసాయన ట్యాంకులో పడి కవలల దుర్మరణం - ఏపీకి చెందిన రామ్​, లక్ష్మణ్​గా గుర్తింపు - హైదరాబాద్​లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘటన.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Twins Death in an Accident at Jeedimetla Industrial Area
Twins Death in an Accident at Jeedimetla Industrial Area (ETV Bharat)

Twins Death in an Accident at Jeedimetla Industrial Area : వారిద్దరూ కవలలు. బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంతా బాగానే ఉందనుకునేలోపు ఓ ఘటన వారి జీవితాలను చిదిమేసింది. రసాయనాల ట్యాంకులో పడి కవలలిద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన హైదరాబాద్​ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా కాట్రేనికోణ మండలం దొంతికూరకు చెందిన రామ్​లక్ష్మణ్​లు కవలలు. వారు ఉపాధి కోసం హైదరాబాద్​ నగరానికి వచ్చారు. శివారు ప్రాంతంలోని గుండ్లపోచంపల్లిలో ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మూతపడ్డ సాబూరి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్​ సంస్థలో ఫ్యాబ్రికేషన్​ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కవలలతో గుత్తేదారు సాదు నారాయణరావు చేయిస్తున్నారు.

రోజువారీగానే బుధవారం ఉదయం కవలలిద్దరూ కంపెనీకి వెళ్లారు. అక్కడ ఓ షెడ్డుకు ఉన్న పైపులను తొలగించే పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్​ అదుపు తప్పి కింద ఉన్న ప్రమాదకర రసాయనాల నిల్వలో పడిపోయాడు. అతను ఆ ట్యాంకులో ఉన్న రసాయనాలను మింగి ఉక్కిరిబిక్కిరవ్వడం చూసిన లక్ష్మణ్​ అందులో దిగాడు. రామ్​ను కాపాడే క్రమంలో లక్ష్మణ్​ నోట్లోకి కొంత రసాయనం వెళ్లింది. స్పృహ కోల్పోయిన రామ్​ను లక్ష్మణ్​ బయటకు తీసుకొచ్చాడు. వెంటనే నోటి నుంచి నురగలు కక్కుకుంటూ లక్ష్మణ్​ అక్కడే పడిపోయాడు.

వీరిద్దరినీ కాపాడే క్రమంలో మరో కార్మికుడు వెంకట్రామ్​రెడ్డి రసాయనంలో పడిపోయాడు. దీంతో మిగిలిన కార్మికులు వీరిని గమనించి సమీపంలోని షాపూర్​నగర్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రామ్​, లక్ష్మణ్​ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. మరో వ్యక్తి వెంకట్రామ్​రెడ్డి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే ఇప్పటికీ ట్యాంకులో నిల్వ చేసిన రసాయనం ఏమిటన్నది ఇంకా నిర్ధారణకు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

కవలలు మృతి (ETV Bharat)

మూసి వేసిన సంస్థలో ప్రమాదకర రసాయనాలు : పోలీసుల విచారణలో మాత్రం సాబూరి పరిశ్రమ నాలుగేళ్లుగా మూసివేసినట్లు తేలింది. కొన్ని రోజులుగా ఆధునికీకరణ పనుల నిమిత్తం కార్మికులు పని చేస్తున్నారు. కానీ ఆ సంస్థ ఆవరణలోని ట్యాంకులో ప్రమాదకర రసాయనాలు ఎలా నిల్వ ఉన్నాయన్నది అర్థం కావడం లేదు. ఆ రసాయన నమూనాలను సేకరించి పోలీసులు ల్యాబ్​కు పంపారు. ఈ ఘటనకు బాధ్యులైన గుత్తేదారు నారాయణరావు, పరిశ్రమ నిర్వాహకులు సతీశ్​రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - 7 గంటలు శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది - Fire Accident

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం - పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురి మృతి - Fire Accident in Sangareddy

ABOUT THE AUTHOR

...view details