తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు వెల్లడి - 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల - TREIRB Gurukulam Results 2024
TREIRB Results 2024 : రాష్ట్రంలోని గురుకుల సొసైటీ పరిధిలోని 2144 పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించింది. మరోవైపు నేటి నుంచి ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను చేపట్టనుంది.
TREIRB Results 2024 : తెలంగాణలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి, 1,276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులకు గురువారం జాబితాలను విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తిచేసింది.
Telangana Gurukulam Results 2024 : వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మినహా మిగతా వాటి ఫలితాలు (Gurukulam Result) వెల్లడి కానున్నాయి. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్/సెట్ స్కోరు తప్పనిసరి. ఇటీవలే సెట్ స్కోరు వివరాలు వచ్చాయి. వాటిని అప్డేట్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టుల తాలూకు మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు వెల్లడించనుంది.
ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ఏర్పాట్లు :ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వివరాలను గురుకుల సొసైటీల వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచింది. మరోవైపు గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 9న (శుక్రవారం), పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు చెక్లిస్టు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తిచేయాల్సిన ప్రాథమిక సమాచార వివరాల కాపీని వెబ్సైట్లో పొందుపరిచింది.
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారాన్ని పంపించామని గురుకుల నియామక బోర్డు వర్గాలు తెలిపాయి. పరిశీలనకు హాజరు కావాలంటూ వ్యక్తిగతంగానూ ఫోన్చేసి తెలియజేశామని పేర్కొన్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్లోని (మెట్రో పిల్లర్ నెం.1570) తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని వివరించాయి. లైబ్రేరియన్ పోస్టులకు ఉదయం 9 గంటల నుంచి, జూనియర్ కళాశాలల పీడీ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి, డిగ్రీ కళాశాలల పీడీ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరిశీలన ఉంటుందని తెలియజేశాయి. పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలవుతుందని గురుకుల నియామక బోర్డు వర్గాలు వెల్లడించాయి.
డెమో తరగతులకు ఏర్పాట్లు :మరోవైపు ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పీడీ, లైబ్రేరియన్, పాఠశాలల్లో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. ఇందుకోసం మాసబ్ట్యాంక్ సంక్షేమభవన్ ఆవరణలో ఆ తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశాయి. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు 10, 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తైన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యత క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. తద్వారా గురుకులాల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా చేయాలనేది గురుకల నియామక బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.