CONSTABLES IN NAGARKURNOOL DISTRICT : ఫొటోలు అడ్డం పెట్టుకొని ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ బ్లాక్ మెయిల్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి, 4 నెలల క్రితం నాగర్కర్నూల్ పట్టణంలోని ప్రధాన రహదారిలో తన కారులో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఓ కానిస్టేబుల్, వారి ఫొటోలను తన ట్యాబ్లో చిత్రీకరించి వారిని బెదిరించాడు.
ఒంటరిగా కారులో ఏం చేస్తున్నారని వారిని భయభ్రాంతులను గురి చేసి, బ్లాక్ మెయిల్ చేశాడు. కేసు నమోదు చేస్తానని, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పెడతామని బెదిరించి రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యక్తి తన స్నేహితుల సహాయంతో రూ.2 వేలను ఆన్లైన్లో ఫోన్ పే ద్వారా ఆ కానిస్టేబుల్కు డబ్బులు పంపించాడు.
మరో కానిస్టేబుల్ వికృత చేష్టలు :ఇది చాలదన్నట్లు ఆ కానిస్టేబుల్ ఆ ఫొటోలను మరో కానిస్టేబుల్కు పంపించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కూడా సదరు వ్యక్తికి ఫొటోలు చూయించి బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఆ ఫొటోలను ఆయన భార్యకు వాట్సప్లో పంపించాడు. దీంతో ఆ భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం ఊర్లో వారికి తెలిసి, భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు.