Special Story on MahaShivaratri Festival : శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి ఇతర పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రి సమయంలో పూజాదికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. రుద్రాభిషేకాలు, బిల్వపత్రార్చనలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. ఐతే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మరలా యథావిధిగా ఆ తరువాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ శివరాత్రి పండుగ వల్ల ఏదైనా ఇతర ఉపయోగం ఉందా? అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచన చేస్తే ఉన్నది అనే జవాబు కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ మంచి కథ ఉంది.
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయం వేటకు వెళ్లడం సాయంత్రానికి ఏదోఒక జంతువును చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం ఆయన దినచర్య. ఐతే ఓ రోజు ఉదయాన్నే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటిపడే సమయమైనా ఒక్క జంతువూ చిక్కలేదు. దాంతో ఆయన నిరాశతో ఇంటి ముఖం పయనమయ్యాడు. అలా వస్తుండగా బోయకు దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రి సమయంలో ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, ఆ సమయంలో దాన్ని తాను చంపవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉన్న ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా 'శివ శివ' అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో కూడా ఆ బోయకు తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినం అని కూడా అతనికి తెలియదు.
రాత్రి సమయంలో మొదటి జాము గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి సరస్సు వద్దకు వచ్చింది. ఆ జింక మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టమని బోయను ప్రాధేయపడంది. మామూలుగా అయితే అతనికి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ ఆడజింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచిపోయింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని చంపాలనే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదు అంటూ విడిచిపెట్టమని వేడుకుంది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు చంపమని కోరింది. మొదట కనపడిన ఆడ జింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతనికి కనిపించింది. ఆ జింకను బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక సైతం మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడ జింకలు ఇటుగా వచ్చాయా అని బోయను అడిగింది. బోయ వచ్చాయని, తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు ఆ మగ జింకకు వివరించాడు. అప్పుడా మగ జింక ఐతే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ టైం దగ్గర పడింది.
బోయవాడు తనకు మాట ఇచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చొని ఉన్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం గమమించాడు. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది. మరికొద్ది సమయానికి 4 జింకలూ బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్ఠతో వాడిముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని వేడుకున్నాయి. ఆ 4 జింకల సత్సవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రి అంతా ఆ బోయ కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడు తెలియకుండానే 'శివ శివా' అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు. ఆ మారేడు చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు. కనుక జాగరణ ఫలితం ఆ బోయకు వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల బోయవాడి మనస్సు నిర్మలం అయింది. పైగా 4 జింకల సత్యనిష్ఠ అతడి మనస్సును పూర్తిగా మార్చేసింది. శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో బోయవాడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడాడు. జింకలు సైతం సత్యనిష్ఠతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున ఆ బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలని అనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. ఆ బోయవాడు జింకలను చంపాలని అనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్య ధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించినవారు, సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి పండగ కథలో కనిపిస్తుంది.
ఆహారం తినకపోతే ఉపవాసం చేసినట్లా? శివరాత్రి జాగారం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?
శివరాత్రి రోజున ఇలా పూజ చేస్తే- సకల పాపాలు నశించి, మోక్షం కలగడం ఖాయం!