తెలంగాణ

telangana

ETV Bharat / state

డీఎస్సీ నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్లిలా వాయిదా వేస్తారు?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ - HIGH COURT ON 2008 DSC RECRUITMENTS

2008 డీఎస్సీ నియామకాలపై హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు - ప్రభుత్వ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం - నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుందంటూ స్పష్టం

Telangana High Court on 2008 DSC Recruitments
Telangana High Court on 2008 DSC Recruitments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 9:55 PM IST

Telangana High Court on 2008 DSC Recruitments :డీఎస్సీ 2008 అభ్యర్థుల పిటీషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. 2008 డీఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఈడ తిరుమలాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు : 2008 డీఎస్సీలో భర్తీకాని ఎస్టీటీ పోస్టులను ఏపీలో వలె అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపట్టాలన్న హైకోర్టు 2024 ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సబ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉండన్నారు. 2008 డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ నియామకాలకు ఆసక్తి చూపారని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 23న విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.

విచారణ10వ తేదీకి వాయిదా :అయితే దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ 2008 నుంచి నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి అంటూ వాయిదా వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఏజీని ఆదేశించింది. నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్లిలా వాయిదా వేస్తూ వస్తారంది. ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, పాత నోటిఫికేషన్‌కు ఎన్నికల ప్రవర్తనా నియమావళితో ముడిపెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని, ఇందులో ఎలాంటి కారణాలు చెప్పొందంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారని, ఇంకా వాయిదా వేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుందంటూ హైకోర్టు పేర్కొంది. 2008 డీఎస్సీ అభ్యర్థుల పిటీషన్లపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.

అసలేం జరిగింది : ఎస్జీటీ పోస్టుల భర్తీకి 2008 డీఎస్సీ నోటిషికేషన్ జారీ అయింది. తరువాత డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించగా ఓపైపు బీఎడ్ అభ్యర్థులు, మరోవైపు డీఎడ్ అభ్యర్థులు అప్పీళ్లపై అప్పీళ్లు వేసుకుంటూ ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా 15 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఎస్టీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులతో భర్తీ అయ్యాయి. అయినప్పటికీ చాలా పోస్టులు మిగిలిపోయాయి. మిగిలిన పోస్టుల్లో అయినా 2008లో అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను నియమించాలని అభ్యర్థులు కోరుతూ వచ్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా 2008లో మెరిట్ సాధించిన 2193 మందికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం గత ఏడాది తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.

60 ఏళ్ల వరకు కాంట్రాక్ట్ నియామకాల్లో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దీంతో ఇదే ప్రాతిపదికన తెలంగాణలోనూ నియామకాలు చేపట్టాలని 2024 ఫిబ్రవరిలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తెప్పించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. 2008 డీఎస్సీల్లో అర్హత సాధించి పోస్టు పొందని 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో సిద్ధంగా ఉన్నారని, నియామకానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి రావడంతో అది ముగిసేదాకా గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

14 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం : డీఎస్సీ 2008 అభ్యర్థులు

డీఎస్సీ-2008 బాధితులకు గుడ్​ న్యూస్ - అతి త్వరలోనే టీచర్లుగా పోస్టింగ్​లు

ABOUT THE AUTHOR

...view details