తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 8:30 PM IST

Updated : Aug 22, 2024, 9:58 PM IST

ETV Bharat / state

గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ - ఛైర్మన్‌గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్​రాజు - Gaddar Awards Committee

Committee for Gaddar Awards : చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గద్దర్‌ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు, వైస్‌ ఛైర్మన్‌గా నిర్మాత దిల్​రాజులను నియమించింది.

Telangana Govt Formed Committee for Gaddar Awards
Committee for Gaddar Awards (ETV Bharat)

Telangana Govt Formed Committee for Gaddar Awards : తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ అవార్డుల కమిటీకి ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు ఛైర్మన్​గా వ్యవహరించనుండగా దిల్​రాజు వైస్ ఛైర్మన్​గా ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది.

అలాగే కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్​ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్​డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్​గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్​డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆ నివేదికల ఆధారంగా :గద్దర్‌ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన అనంతరం చిత్ర పరిశ్రమ తమని సంప్రదించలేదని కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో వెంటనే అగ్ర కథానాయకుడు చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ విషయమై దృష్టి సారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ)తో చర్చించి, విధి విధానాలను రూపొందించి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌తో పాటు, కమిటీ సభ్యులను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

వచ్చే ఏడాది నుంచే : ఫిబ్రవరిలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్​, నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున ఆ పురస్కారాలు ఇస్తామని తెలిపారు. వారి సేవలను స్మరించుకునేందుకే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గద్దర్ అవార్డుల కోసం కమిటీని నియమించింది.

'నంది' ఇక నుంచి గద్దర్ అవార్డు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ఆ క్షణం అంతాఇంతా ఆనందం కాదు - 'గద్దర్​ పురస్కారాలు'గా నంది అవార్డులు మంచి నిర్ణయం : చిరంజీవి

Last Updated : Aug 22, 2024, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details