Ryhtu Bharosa Funds Will Be Released Today :రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త తెలిపారు. బుధవారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమవుతాయని వెల్లడించారు. ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని, సీఎం ఆదేశాలతో జమ చేస్తున్నామని తుమ్మల పేర్కొన్నారు.
వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా : జనవరి 26న ప్రారంభోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 గ్రామాలలో 9లక్షల 48వేల 333 ఎకరాలకు రూ.4,41,911మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.569 కోట్ల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. విడతల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
పంటలు పండిన భూముల లెక్కేసిన సర్కార్ :రైతు భరోసా కేవలం సాగు భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుని పరిశీలించింది. దాదాపు 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు గుర్తించింది. దీంతో వీటిని ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలనుకుంటుంది. ఈ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమి కుడా ఇంతకు మించి ఉంటే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేసింది. 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధం అవుతుండగా, ఇక నుంచి సాగు చేయలేని భూములకు రైతు భరోసా వేయకూడదని నిర్ణయించుకున్నారు.