Minister Ponguleti Review on Revenue Dept :ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు రెవెన్యూ శాఖలో కొత్త టెక్నాలజీలను అవలంభించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ సమస్యలపై ఇవాళ ఎంసీహెచ్ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంకితభావంతో పని చేయాలి :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ నిజాయతీ, అంకిత భావంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ సమస్యలను త్వరలో క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
త్వరలో శాశ్వత భవనాలు : రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి పొంగులేటి ప్రస్తావించారు. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో శాశ్వత ప్రభుత్వ భవనాల్లో పని చేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.