తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్‌ రూ.30 కోట్ల భారీ విరాళం - RAMOJI FOUNDATION DONATION TO ISB

ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్‌ భారీ విరాళం - రూ.30కోట్ల విరాళం అందజేసిన రామోజీ ఫౌండేషన్‌ ట్రస్టీ సీహెచ్‌ కిరణ్‌ - 430 సీట్ల అంతర్జాతీయస్థాయి ఆడిటోరియం నిర్మాణానికి విరాళం

Ramoji Foundation Donation to ISB
Ramoji Donates 30 crore to ISB (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 8:34 PM IST

Updated : Nov 22, 2024, 9:42 AM IST

Ramoji Foundation Donation to Indian School of Business :హైదరాబాద్​లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్‌ భారీ విరాళం ప్రకటించింది. ఐఎస్‌బీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆ నిధులను అందించింది. రామోజీ ఫౌండేషన్‌ ట్రస్టీ సీహెచ్‌ కిరణ్‌ రూ.30 కోట్ల విరాళం అందజేశారు. ఐఎస్‌బీకి కొత్తగా అందుబాటులోకి రానున్న ఎగ్జిక్యూటివ్ సెంటర్​లో 430 సీట్ల సామర్థ్యంతో నిర్మించే అత్యాధునిక ఆడిటోరియం కోసం ఆ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనాత్మక సెమినార్లు, ప్రముఖుల ప్రసంగాలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.

రామోజీ ఫౌండేషన్‌ యాజమాన్యంతో ఐఎస్‌బీ ప్రతినిధులు (ETV Bharat)

'దేశంలో అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్య లభించాలన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ రామోజీరావు గౌరవార్థం, ఐఎస్​బీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించేందుకు ఈ సహాయం అందించాం. ఆధునిక సదుపాయాలతో ప్రపంచస్థాయి బిజినెస్ స్కూల్​గా ఐఎస్​బీ నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం' - సీహెచ్ కిరణ్, రామోజీ ఫౌండేషన్​ ట్రస్టీ & రామోజీ గ్రూప్ సీఎండీ

కృతజ్ఞతలు తెలిపిన ఐఎస్‌బీ బోర్డు ఛైర్మన్‌ :అధ్యయనం, పరిశోధనలో ఐఎస్​బీ ప్రపంచస్థాయి సంస్థగా ఎదగడంలో దాతలిచ్చిన విరాళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని బోర్డు ఛైర్మన్ హరీశ్ మన్వానీ తెలిపారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను నిలబెట్టుకునేందుకు రామోజీ ఫౌండేషన్ అందించిన సహకారం ఉపయోగపడుతుందన్న ఆయన, ఈ సందర్భంగా ఫౌండేషన్​కు కృతజ్ఞతలు తెలిపారు. దాతల మద్దతు ఐఎస్​బీ అభివృద్ధిలో గణనీయంగా సహాయపడుతోందని డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు. రామోజీ ఫౌండేషన్ అందించిన విరాళం బిజినెస్ స్కూల్​లో ప్రపంచస్థాయి అభ్యాస అనుభవాలు పొందేందుకు సహకరిస్తుందని తెలిపారు.

ఐఎస్‌బీకి రూ.30 కోట్ల విరాళం ఇచ్చిన కార్యక్రమంలో రామోజీ గ్రూప్‌ ఆడిటర్‌ సాంబశివరావు, డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్, రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, డాల్ఫిన్‌ హోటల్స్‌ డైరెక్టర్‌ సోహన, ప్రియ ఫుడ్స్‌ డైరెక్టర్‌ సహరి, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, రామోజీరావు మనవడు సుజయ్, ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల, ఆయన భార్య అర్చన, ఐఎస్‌బీ బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌ హరీశ్‌ మన్వానీ, రామోజీ గ్రూప్‌ కంపెనీల సెక్రటరీ శ్రీనివాసరావు, ఐఎస్‌బీ సీనియర్‌ డైరెక్టర్‌ కుమార గురు తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Nov 22, 2024, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details