No Screens for Pushpa 2 in Prasads Multiplex : చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ఇష్టమైన సినిమా థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందుంటుంది. ఇందులో ప్రతి మూవీని చూసేందుకు, సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా హీరో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప ది రూల్ను ఇందులో చూడాలని ఎదురుచూస్తున్న సినీప్రియులకు చివరికి నిరాశే ఎదురైంది. ఈ సినిమాను తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి తాము వర్క్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ తెలిపింది. దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాలతో ప్రసాద్ మల్టీప్లెక్స్లో హీరో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2ను ప్రదర్శించలేకపోతున్నామని వెల్లడించింది. సినీ ప్రేమికులకు అసౌకర్యం కల్పించినందుకు తాము ఎంతో చింతిస్తున్నామని పేర్కొంది. తమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని పేర్కొంది. కాగా పుష్ప 2 సినిమాను ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ వేదికగా ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ చేసిన పోస్టు వైరల్గా మారింది.