తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటెక్​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​ - మేనేజ్​మెంట్ సీట్లపై సర్కార్ కీలక నిర్ణయం?

బీ కేటగిరి సీట్ల అమ్మకాల దందాను చెక్​ పెట్టేందుకు కసరత్తు - శాశ్వత విధానం తీసుకువచ్చే దిశగా ఉన్నత విద్యామండలి

TSCHE Focus On BTech B cat seats
TSCHE Focus On BTech B cat seats (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Management Seats Sale Prevention In Btech : ఇంజినీరింగ్‌లో బీ కేటగిరీ(మేనేజ్​మెంట్​) సీట్ల అమ్మకాలను అడ్డుకునేందుకు శాశ్వత విధానాన్ని రూపొందించే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ దందాపై ఏటా విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపితే తమ వైపు వేలెత్తి చూపేవారే ఉండరని, మరోవైపు తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్​ (2025-26)లో ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చేయాలనే పట్టుదలతో ఉన్న ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు.

నిబంధనలకు భిన్నంగా :రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 70 శాతం బీటెక్​ సీట్లను ప్రభుత్వమే మెరిట్, రిజర్వేషన్‌ ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంలో భర్తీ చేస్తోంది. మిగిలిన 30 శాతాన్ని బీ కేటగిరీ లేదా మేనేజ్​మెంట్ కోటా కింద ఆయా కళాశాలలే భర్తీ చేసుకుంటాయి. నిబంధనల ప్రకారం ఈ విభాగం సీట్లను జేఈఈ మెయిన్‌/ ఎప్‌సెట్‌ ర్యాంకు/ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్‌ కోటా రుసుమును మాత్రమే వసూలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మెరిట్‌ను పట్టించుకోకుండా, ఎక్కువ చెల్లించేందుకు ఎవరు ముందుకొస్తే వారికే యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్టుగా ఆరోపణలున్నాయి.

ఏటా రూ.కోట్ల రూపాయల వసూళ్లు దందా :రాష్ట్రంలో 150 వరకు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా, ఆయా మేనేజ్​మెంట్ గిరాకీ ఉన్న సీఎస్‌ఈ తదితర బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా సర్కారు వద్ద సమాచారం ఉంది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి మేనేజ్​మెంట్ కోటా కింద ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా సీట్లు భర్తీ అవుతున్నాయి.

సగటున ఒక్కో సీటు రూ.5 లక్షలు అనుకున్నా యాజమాన్యాలు రూ.వెయ్యి కోట్లు దండుకుంటున్నాయని అంచనా. మరోవైపు సీట్ల అమ్మకం వ్యవహారంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఏటా ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదులు చేయడంతోపాటు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు తక్కువ మొత్తానికి సీట్లు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారని ఉన్నతాధికారులే చెబుతున్నారు.

పరిష్కార మార్గాల కోసం అన్వేషణ :‘మెరిట్‌ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఎంబీబీఎస్‌ తరహాలో ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలా? లేదా ఇతర మార్గాలేమైనా ఉన్నాయా? అనేది అన్వేషిస్తున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. తాజాగా విద్యామండలి నూతన ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఈ సమస్యపై ఫోకస్​ పెట్టారు. అడ్మిషన్ల జీఓలు, న్యాయపర సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. ఛైర్మన్‌ లా(న్యాయవిద్య) ఆచార్యుడు కావడం, చట్టాల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలను అధిగమించి సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నారు.

సీట్ల అమ్మకాలకు చెక్​ పెట్టే దిశగా :సమస్యపై పూర్తిగా అధ్యయనం చేసి సర్కారుతో సంప్రదించి, వచ్చే ఏడాది నాటికి సీట్ల అమ్మకాల విమర్శలకు అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో బీ, సీ కేటగిరీ సీట్లకు రుసుము నిర్ణయించి కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి -

ఇంటర్​ పూర్తయిందా? నెక్ట్స్​ ఏంటి అనే డైలమాలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే!

ABOUT THE AUTHOR

...view details