తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంభమేళాకు వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం - హైదరాబాద్​కు చెందిన 8 మంది దుర్మరణం - TG PEOPLE DIED ROAD ACCIDENT IN MP

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణకు చెందిన 8 మంది మృతి - తెలంగాణ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘటన - మృతదేహాలను త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం

AP PEOPLE DIED ROAD ACCIDENT IN MP
AP PEOPLE DIED ROAD ACCIDENT IN MP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 11:47 AM IST

Road Accident : వారంతా హైదరాబాద్‌ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఇంటికి వెనుదిరిగారు. కానీ మార్గమధ్యలోనే మృత్యువు లారీ రూపంలో వారిని కబళించింది.

ఉదయం 8 గంటలు. మధ్యప్రదేశ్‌ జబల్‌పుర్‌లోని సిహోరా ప్రాంతం. హైవే వంతెనపైకి రాంగ్‌రూటులో వచ్చిన సిమెంట్‌ లోడ్‌ లారీ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు తుక్కుతుక్కుగా మారి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు దాంట్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారంతా ఏపీ వాసులుగా తొలుత భావించినా మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో హైదరాబాద్‌ నాచారంలోని రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు.

ప్రమాదంలో నాచారానికి చెందిన శశికాంత్, మల్లారెడ్డి, రవిప్రకాశ్, సంతోష్‌కుమార్, డ్రైవర్ రాజుతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఆనంద్, తార్నాక వాసి టీవీప్రసాద్ అనే ఈ ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనతో నాచారంలోని బాధితులు ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రయాణికులు క్షేమం :ఘటనా సమయంలో మినీ బస్సు వెనుకగా వచ్చిన తెలంగాణకు సంబంధించిన కారు సైతం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన కారు వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డిదిగా గుర్తించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సూర్యచంద్రారెడ్డి చేయి విరగ్గా అందులో ఉన్న మరో ముగ్గురికి స్పల్ప గాయాలయ్యాయి.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి :ఘటన విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు మృతదేహాలను త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై రంగారెడ్డి కలెక్టర్ జబల్‌పూర్‌ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను కూడా ఫోన్‌లో పరామర్శించారు. మేడ్చల్ అదనపు కలెక్టర్ సైతం బాధిత కుటుంబీకులతో మాట్లాడారు.

రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

మృతుల్లో ఒకరైన శశికాంత్‌ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆనంద్‌, సంతోష్‌లు బంగారం వ్యాపారులుగా పని చేస్తున్నారు. కుంభమేళాకు వెళ్లిన వీరిలో శశికాంత్, సంతోష్, నవీన్, ఆనంద్‌లు దగ్గరి బంధువులు కాగా మిగిలినవారు స్నేహితులని స్థానికులు తెలిపారు. మరో మృతుడు మల్లారెడ్డి నాచారం కార్తికేయనగర్ కాలనీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి- 17మందికి తీవ్రగాయాలు

అతి వేగం తెచ్చిన ప్రమాదం - ఒకరు మృతి, 20 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details