తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ పాండవుల దేవాలయంలో మొక్కులు తీర్చుకుంటే పంటలు బాగా పండుతాయట' - PEDDAYYAGUTTA TEMPLE AT DANDEPALLI

రైతన్న గుడి కోర్కెలు తీర్చే ఒడి - తెలంగాణలో ఉన్న ఏకైక పాండవుల దేవాలయం - ఆది, గురువారాల్లో రైతులు సందడి అధికం - ఎన్నో వింతలు ఉన్న పెద్ద గుట్ట దేవాలయం

Farmer Temple
Farmer Temple (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2024, 8:59 AM IST

Updated : Dec 18, 2024, 1:52 PM IST

Peddayyagutta Temple: అన్నదాతల కోసం ఓ గుడి ఉందనే విషయం ఎంతమందికి తెలుసు. ఇక్కడ రైతులు ఏ కోర్కెలు కోరుకున్న తీరుతాయని విశ్వాసం. ఇక్కడకు వానాకాలం వరి కోతలు మొదలు మళ్లీ యాసంగి పనులు ఊపందుకునే వరకు రైతులు సందడి చేస్తారు. మళ్లీ తిరిగి యాసంగి పనులు పూర్తయి వానాకాలం ప్రారంభమయ్యే వరకు అన్నదాతలతో గుడి ప్రాంతం కిటకిటలాడుతుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా. చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన గుట్టలు మధ్య వెళితేనే ఈ గుడికి చేరుకోగలం. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో పెద్దయ్య-చిన్నయ్య దేవుని ఆలయం ఇది. ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ స్వామిని భక్తులు కొంగు బంగారంగా పూజిస్తారు.

చరిత్ర : దండేపల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పెద్దయ్య-చిన్నయ్య దేవాలయం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ కొండల్లోనే ఉండేవారని ప్రతీతి. పెద్దయ్య అంటే ఇక్కడ ధర్మరాజు.. అందుకే గుడిని పెద్దయ్య గుడిగా, గుట్టను పెద్దయ్య గుట్టగా పిలుస్తారు. భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రదేశాన్ని పెండ్లి మడుగుగా పిలుస్తారు. అర్జునుడి పేరు మీద అర్జుగూడ.. ఈ గుట్టకు కొంత దూరంలో అర్జున లొద్ది నీటి గుండం కూడా ఉంది. సహదేవుని పేర వెలిసిన సామగూడ కూడా ఇక్కడ ఉన్నాయి.

ఎలా వెళ్లాలి :దండేపల్లి నుంచి ఊట్ల వరకు వాహనాలలో వెళ్లడానికి రహదారి నిర్మాణం ఉంది. కానీ అక్కడ నుంచి మిగతా మార్గమంతా కాలినడకనే వెళ్లాలి. రెండు కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణం చేయాలి. చుట్టూ రాళ్లు, చెట్లు మధ్యలో నుంచి నడవడం అనేది కొత్త అనుభూతిని ఇస్తుంది.

నిటారుగా ఉన్న పెద్దయ్య గుట్ట ఇదే (ETV Bharat)

బాగా పంటలు పండుతాయని విశ్వాసం :ప్రతి ఆది, గురువారాల్లో ఇక్కడకు ఉమ్మడి ఆదిలాబాద్​, వరంగల్​, నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు, సామాన్యులు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇలా చేస్తే పంటలకు చీడలు లేకుండా బాగా పండుతాయని అక్కడివారిలో విశ్వాసం. ఇక్కడకు వర్షాకాల ప్రారంభం, విత్తు నాటేప్పుడు, వరి కోతలు సమయంలో రైతులు అధికంగా వస్తుంటారు. ఈ గుడిలో దేవుడు వెలసడంతో ఇల్లారి అని పిలుస్తారు.

భీముని పాద ముద్రలు (ETV Bharat)

భీముని పాద ముద్రలు :లక్షెట్టిపేట మండలం చల్లంపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతం ఉంది. అక్కడ చిన్నయ్య కుటీరం ఉంటుంది. ద్రౌపది స్నానం ఆచరించిందనడానికి గుర్తుగా కుండలు, కొలను భీముడు వ్యవసాయం చేసినట్లుగా నల్లని రాయిపై ఎద్దుల గిట్టల ముద్రలు, భీముని పాదముద్రలు ఇక్కడ ఉండటం విశేషం. ఇక్కడి నుంచి 2 కి.మీ. వెళ్తే మంచు కొండలు వస్తాయి. అక్కడ రాతి కొండల మధ్య నీరు జాలువారుతుంది. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే సందర్శకులు ఎంత శబ్దం చేస్తే అంత ఎక్కువ నీరు కొండల నుంచి పడుతుంది.

గుట్ట దిగి వస్తున్న పూజారి (ETV Bharat)

పూజారులే గుట్ట ఎక్కుతారు :గుడికి ఎదురుగా సుమారు 300 మీటర్ల ఎత్తులో నిటారుగా ఉండే పెద్దయ్య గుట్ట ఉంటుంది. ఆ గుట్టను పూజారులే ఎక్కడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. పది నిమిషాల్లో వెళ్లి కిందకు వచ్చేస్తారు. వచ్చేటప్పుడు భక్తులు ఎదురుగా నిలబడి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. గుట్టపై నుంచి పసుపు, కుంకుమలు, ధాన్యం తీసుకుని వస్తారు. చీడపీడల నివారణ తదితర అనేక వివరాలను ఆయన తెలియజేస్తారు. ఆయన ఇచ్చిన పసుపు కుంకుమలను పొలాల్లో చల్లితే ఎలాంటి రోగాలు రావని రైతులకు గాఢమైన నమ్మకం.

అల్లుబండ (ETV Bharat)

అల్లుబండ గట్టి నమ్మకం :రెండు గుండ్రటి రాళ్లు ఉంటాయి. వీటిని అల్లుబండలు అని పిలుస్తారు. ఇవి ఇల్లారిలో విగ్రహాల ముందున్న గద్దెపై ఉంటాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు వీటిని లేపి చూసి.. వారి మనసులో ఒక పని అనుకుని బండలు లేపాలి. పని అయ్యేటట్లయితే ఆ బండలు లేవవు.. కాదనిపిస్తేనే బండలు లేస్తాయనేది ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం.

వరంగల్​లో భూగర్భ దేవాలయం - కాపాడుకుంటేనే మన చరిత్ర సజీవం

పశువుల పాక కింద పురాతన జైన విగ్రహం - బైరాన్​పల్లిలో తీర్థంకరుడి శిల్పం - Jain Idol was found in siddipet

Last Updated : Dec 18, 2024, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details