తెలంగాణ

telangana

"పాతబస్తీ మెట్రో భూసేకరణ 8 నెలల్లో పూర్తయ్యే అవకాశం - అభ్యంతరాలుంటే మెట్రో ఆఫీసులో సంప్రదించాలి" - Old City Metro Land Acquisition

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 10:10 PM IST

Old City Metro Land Acquisition : పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు మార్గం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మెట్రో రైలు యాజమాన్యం వెల్లడించింది. 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్లు విస్తరణ, స్టేషన్ల నిర్మాణం వల్ల దాదాపు 1200 ఆస్తులపై ప్రభావం పడుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అందులో ఇప్పటికే 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్న ఆయన, మొత్తం ప్రక్రియ దాదాపు 8 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మార్గంలో ఆస్తుల యజమానులు ఏవైనా అభ్యంతరాలుంటే నిర్ణీత వ్యవధిలో మెట్రో అధికారులను సంప్రదించాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

Old City Metro Rail Land Acquisition Process Expediting
Old City Metro Land Acquisition (ETV Bharat)

Old City Metro Rail Land Acquisition Process Expediting :రెండో దశ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలును పరుగులు పెట్టించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అడుగు ముందుకేసింది. అందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మార్గంలో దాదాపు 1200 ఆస్తులపై ప్రభావం ఉంటుందన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇప్పటికే భూసేకరణ చట్టం 2013 ప్రకారం 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ బృహత్ ప్రణాళిక ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతుందని, మెట్రో స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో విస్తరణ ఉంటుందన్నారు. దారుల్ షఫా నుంచి శాలిబండ జంక్షన్ వరకు ప్రెజెంట్ రహదారి వెడల్పు 50 అడుగుల నుంచి 60 అడుగుల వరకు, శాలిబండ జంక్షన్ నుంచి చంద్రాయణ గుట్ట జంక్షన్ వరకు 80 అడుగుల వెడల్పు ఉందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అందువల్ల దారుల్ షఫా - శాలిబండ జంక్షన్ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందన్నారు.

మెట్రో రైలు భూసేకరణపై డ్రోన్ సర్వే చేశాం : అలాగే శాలిబండ నుంచి చంద్రాయణ గుట్ట మధ్య ఒక్కో భవనాన్ని 10 అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, మూలమలుపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్తా ఎక్కువగా ఉంటుందన్నారు. భూసేకరణ కోసం సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు 3డీలో వీక్షించేలా లైడార్ డ్రోన్ సర్వే చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దానివల్ల ప్రభావితమయ్యే ఆస్తులతోపాటు చుట్టుపక్కల నిర్మాణాలు కూడా కనిపిస్తాయన్నారు.

ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఏఎంఎల్ ఇంజినీర్లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మెట్రో మార్గంలో 103 మతపరమైన, సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. విలక్షణ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా, ఫిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ మెట్రో మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. పాతబస్తీలో మెట్రో రైలు కోసం భూసేకరణ ప్రక్రియ 8 నెలల్లో పూర్తవుతుందని, ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు తమ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా మెట్రో రైలు భూసేకరణ అధికారి కార్యాలయం వద్ద దాఖలు చేయాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్​అండ్​టీ కీలక ప్రకటన - Metro Rail Officials On Parking Fee

హైదరాబాద్​లో అండర్ ​గ్రౌండ్ మెట్రో - ఎయిర్​పోర్టు కారిడార్‌లో తొలిసారి ప్రయోగం - Underground Metro in Hyderabad

ABOUT THE AUTHOR

...view details