తెలంగాణ

telangana

ETV Bharat / state

సూటిపోటి మాటలే ప్రాణాలు తీశాయ్‌! - ఎస్సై భార్య ఫిర్యాదుతో సీఐ సహా కానిస్టేబుళ్లపై వేటు - Aswaraopet SI Suicide Incident

Aswaraopet SI Suicide Incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. తన భర్త మృతికి సీఐ జితేందర్‌రెడ్డి, మరో నలుగురు కానిస్టేబుళ్లు కారణమని ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్‌ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను మరణవార్త విని మేనత్త గుండెపోటుతో కన్నుమూశారు. ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు సీఐ జితేందర్‌రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీకి అటాచ్‌ చేశారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 6:46 AM IST

Updated : Jul 8, 2024, 6:55 AM IST

SI Sriramula Srinu
SI Sriramula Srinu (ETV Bharat)

Aswaraopet SI Sriramula Srinu Suicide Update : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. గతనెల 30న మహబూబాబాద్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ మృతిచెందారు. తన భర్త మృతికి సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసినాయుడు, సుభాని, శివనాగరాజులే కారణమని, ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్‌ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చికిత్స పొందే సమయంలో శ్రీను, తనను వేధించిన తీరును కుటుంబసభ్యులతో పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. వారం కింద బలవన్మరణానికి యత్నించిన ఎస్సైని తొలుత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీను మరణవార్త తెలియగానే ఆయన మేనత్త, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు.

వరంగల్‌ జిల్లా నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీను, 2014 బ్యాచ్‌కు చెందినవారు. తొలి పోస్టింగ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహించారు. అనంతరం పలు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ ఆర్నెల్ల కిందట అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. మరో ఏడాది అయితే, ఆయనకు సీఐగా పదోన్నతి లభించనుంది. ఈ తరుణంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

మృతుడికి భార్య, కుమార్తె , కుమారుడు ఉన్నారు. అశ్వారావుపేట స్టేషన్‌ అధికారి -సీఐ, కానిస్టేబుళ్లు తనపట్ల అవమానకరంగా వ్యవహరించారని, కులం పేరుతో దూషించారని ఎస్సై శ్రీను తన వీడియో సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినా స్పందన లేదని తెలిపారు. ఇదే క్రమంలో వేరే చోటుకు బదిలీ చేయించుకునేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని శ్రీను కలిసినట్లు సమాచారం. ఆ ప్రక్రియ ఆలస్యమైన క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్వారావుపేట ఎస్సై మృతి - ఆ ఐదుగురిపై కేసు నమోదు - Ashwaraopet si died

ఎస్సై శ్రీను ఆత్మహత్యాయత్నంపై మహబూబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఆయన భార్య కృష్ణవేణి ఈనెల 5 న హైదరాబాద్‌ మలక్‌పేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు, ఈ కేసును మహబాబూబాద్‌ ఠాణాకు బదలాయించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సీఐ జితేందర్‌రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీకి కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కేసుపై కొత్తగూడెం స్పెషల్‌ బ్రాంచి ఎస్​బీ సీఐ నాగరాజుతో పాటుగా ఏడూళ్లబయ్యారం సీఐ కరుణాకర్‌లు ప్రాథమిక విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

ఎస్సై ఆత్మహత్యాయత్నం అనంతర పరిణామాలపై సీఐ జితేందర్‌రెడ్డి భార్య ఎం.శైలజ స్పందించారు. జరిగిన తన భర్త సామాజిక వర్గాన్ని ఉటంకిస్తూ ఆరోపణలు చేయొద్దని స్థానిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సై బలవన్మరణ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అశ్వారావుపేటలో జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. నారక్కపేటలో దళిత, గిరిజన సంఘాల నాయకులతో పాటుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఎస్సై బంధువులు శ్రీను మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ నారక్కపేటలో శ్రీను అంత్యక్రియలు ముగిశాయి.

'నేను కూడా దళిత బిడ్డనే' - ఎస్సై ఆత్మహత్యపై స్పందించిన సీఐ భార్య - ASWARAOPETA SI SUICIDE INCIDENT

Last Updated : Jul 8, 2024, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details