తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 2:01 PM IST

ETV Bharat / state

వీడుతున్న చిక్కుముడులు - ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు భాగాలు ఒకేసారి నిర్మాణం! - Hyderabad Regional Ring Road news

Hyderabad Regional Ring Road : హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు విషయంలో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఈసారి రెండు భాగాలను ఒకేసారి కలిపి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Hyderabad Regional Ring Road
Hyderabad Regional Ring Road (ETV Bharat)

Hyderabad Regional Ring Road New Updates : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు. ఈసారి ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం చేసిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలోనే పనులు చేపట్టేందుకు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు దిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర అధికారులకు ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ను ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 350.79 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు ఉత్తర భాగానికి సంబంధించి 161.59 కిలోమీటర్ల భాగానికి కేంద్రం నాలుగేళ్ల కింద జాతీయ రహదారి హోదాను ఇచ్చింది. ఇందుకు 4,750 ఎకరాల వరకు భూసేకరణ చేసి నిర్మించాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది. వచ్చే జులై నెలలో భూముల యజమానులకు చివరి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లును చేస్తున్నారు. అదే సమయంలో కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు సూత్రప్రాయ ఆమోదం :ఇక దక్షిణ భాగంలో భాగంగా చౌటుప్పల్‌, ఆమల్‌గల్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నంబరును త్వరలో కేటాయించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆయా ప్రతిపాదనలను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.

మరో రెండు సమస్యలకు పరిష్కారం :

  • రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ రకాల తీగలు, స్తంభాలు, పైప్‌లైన్ల తరలింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఇందుకు వ్యయం రూ.300 కోట్లకు పైగా అవ్వడంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై పీటముడి పడింది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకోగా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆ మొత్తం చెల్లించేందుకు ఒప్పుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
  • ఆర్‌ఆర్‌ఆర్‌కు భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని గతంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రూ.100 కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ విధానాన్ని కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. రైతులకు పరిహారం చెల్లించిన వెంటనే మరో రూ.100 కోట్లను ఆ నిధికి జమ చేయనున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లను ఆ నిధికి పంపించింది. ఇలా ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతున్నాయి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ముందుకు సాగుతుందన్న నమ్మకం అందరిలో పెరిగింది.

Telangana Regional Ring Road : భారత్‌మాల-2 ప్రాజెక్టులో తెలంగాణ ఆర్ఆర్ఆర్

మరింత పొడవుగా ఆర్‌ఆర్‌ఆర్‌... దక్షిణ భాగానికి త్వరలో జాతీయ హోదా

ABOUT THE AUTHOR

...view details