Ration Cards In Hyderabad :రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ఇంకా సభలు జరగడం లేదు. నగరంలో రేషన్ కార్డుల మంజూరులో జాప్యం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో మాదిరే గణతంత్ర దినోత్సవం రోజున నగరంలో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవలె కులగణన సర్వేలో రేషన్ కార్డు కోసం అర్జీ పెట్టుకున్న 83 వేల మంది అర్హతల పరిశీలనను మంగళవారంతో పూర్తి చేసింది. అయితే ఇటీవలె ప్రజాభవన్కు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు సుమారు లక్షమంది కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
సర్వే పూర్తయినా ఆగని దరఖాస్తులు : దీంతో ముందు అనుకున్నట్లు జనవరి 26 న రేషన్ కార్డులు జారీ చేస్తే వారంతా అసంతృప్తి చెందుతారని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. కొంత ఆలస్యం చోటుచేసుకున్నప్పటికీ అందరికీ న్యాయం చేయాలని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పష్టం చేశారు. ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులని గుర్తిస్తామని అన్నారు.
రేషన్కార్డులు ఆలస్యం : అర్హుల పరిశీలన మరో వారం కొనసాగుతుందని పిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవలె సామాజిక, ఆర్థిక సర్వే కులగణన పూర్తి చేసింది. అందులో భాగంగా 83 వేల కుటుంబాలు అర్జీ పెట్టుకున్నాయి. వారి అర్హతలను పరిశీలించగా 90 శాతం మంది అర్హులని తేలినట్లు అధికారులు తెలుపుతున్నారు.