తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దక్కని కొత్త ప్రాజెక్టులు, నిధులు! - TELANGANA GETS ZERO UNION BUDGET

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి మొండిచేయి - ఆశించిన స్థాయిలో దక్కని కేటాయింపులు - తమ ప్రతిపాదనలు పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం

TELANGANA GETS ZERO UNION BUDGET
UNION BUDGET 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 9:58 PM IST

Union Budget 2025 : కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన పథకాలు, కేటాయింపులు ఏమీ దక్కలేదు. బిహార్‌, అస్సాం, అండమాన్‌, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లకు మినహా ఏ రాష్ట్రానికి నేరుగా ఎలాంటి కేటాయింపులు, ప్రాజెక్టులు ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజక్టులకు ఆయా శాఖల ద్వారా కేటాయింపులు చేశారు. ఐఐటి, ట్రైబల్‌ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్‌ వంటి వాటికి గతంలో నేరుగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా ఈ ఏడాది ఆయా శాఖల ద్వారానే అవసరమైన నిధులు అందించనున్నారు.

ఆయా మంత్రిత్వ శాఖల ద్వారానే : రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సముద్ర పరిశోధనా, సమాచార కేంద్రం ఇన్‌కాయిస్​కి 29 కోట్లు, అణు ఇంధన ఖనిజాల తవ్వకాల సంస్థకు 387.50 కోట్లు కేటాయించారు. నైపర్‌, ఐఐటి హైదరాబాద్‌, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వ విద్యాలయాలకు గతంలో నేరుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు. ఆయా సంస్థలకు ఇప్పటికే ప్రత్యేక పద్దులు ఉన్న నేపధ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల విభాగాల నుంచే నిధులు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఐఐటిలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలను ఒకే జాబితాగా చేర్చి వాటికి ఉన్న పద్దు కింద నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఐఐటి హైదరాబాద్‌కు విదేశాల నుంచి రుణాలు ఈఏపీ కింద తీసుకునే జాబితాలో చేర్చారు.

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర సంస్థలు జాతీయ మత్య్స సంపద అభివృద్ది బోర్డుకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులకు కేంద్ర హోం శాఖ ద్వారా ఇచ్చే పెన్షన్లు, ఐపీఎస్‌ అధికారుల శిక్షణా కేంద్రం వల్లభాయ్‌ పటేల్‌ అకాడమీకి, జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్‌ సంస్థ - ఎన్‌ఐఆర్‌డికి, అంతర్జాతీయ పౌడర్‌ మెటలర్జీలకు ఆయా శాఖల ద్వారా నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనే దృష్టి : నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొత్తంలో బిహార్‌, అస్సాం, గుజరాత్‌, అండమాన్‌ నికోబార్‌, ఈశాన్య రాష్ట్రాల పేర్లు, అక్కడి ప్రాజక్టుల ప్రస్తావన మినహా మరే రాష్ట్రం పేరు ప్రస్తావించలేదు. ఈ ఏడాది చివరి ‌త్రైమాసికంలో ఎన్నికలు జరిగే బిహార్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే, కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి అనుగుణంగా నిధులు ఇచ్చారే తప్ప ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని కేంద్ర మంత్రులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడింది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు.

కేంద్ర బడ్జెట్​తో మనకెంత లాభం? - మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

పేదలు, యువత, అన్నదాతలే టార్గెట్​- కేంద్ర బడ్జెట్​లో కీలక విషయాలివే!

ABOUT THE AUTHOR

...view details