Baby Kidnap In Sangareddy Govt Hospital :సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళా కిడ్నాపర్ల ముఠా అప్పుడే పుట్టిన ఓ శిశువును అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో శిశువుని నలుగురు మహిళల గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఈ నేరానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దుడికొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ అలీ భార్య నశిమా ఐదో కాన్పుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సిజేరియన్ ద్వారా ఆ గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కొంత సేపటికే శిశువు అపహరణకు గురైంది. దీంతో భార్యాభర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి పరిసరాల్లో ఎంత వెదికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
బురఖా వేసుకుని వచ్చి కిడ్నాప్ చేసి :మహిళ ప్రసవ సమయంలో బురఖా వేసుకుని వచ్చి ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగున్న నలుగురు మహిళలే ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ కిడ్నాపర్ల గ్యాంగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నలుగురు మహిళల ముఠా వ్యవహారశైలి చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్స్లా ఉన్నారు. బురఖా వేసుకుని వచ్చి కిడ్నాప్ చేసి శిశువుతో బయటకు వెళ్లిన గ్యాంగ్ ఆ తరువాతం వేషం మార్చేసింది. కిడ్నాప్ తర్వాత నంబర్ ప్లేట్ లేని స్కూటీపై ఇద్దరు, ఆటోలో మరో ఇద్దరు మహిళలు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ రూపేశ్ పది బృందాలను కేటాయించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.