తెలంగాణ

telangana

ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సం - వరదలో చిక్కుకుపోయిన 9మంది, రంగంలోకి హెలికాప్టర్లు - Munneru Vagu Heavy Flood

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 3:09 PM IST

Updated : Sep 1, 2024, 6:13 PM IST

Munneru Vagu Water Folw Raising High : ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు మహోగ్రరూపం దాల్చుతూ ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి మున్నేరు పరివాహక కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్​నగర్​ బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించడానికి ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లను మంత్రి తుమ్మల రప్పించారు. ఈ మేరకు ఏపీ సీఎస్​ నీరబ్​కుమార్ ప్రసాద్​​తో మాట్లాడారు.

Munneru Vagu Heavy Flood in Khammam
Munneru Vagu Water Folw Raising High (ETV Bharat)

Munneru Vagu Heavy Flood in Khammam :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో పలు కాలనీవాసులు వరదలో చిక్కుకున్నారు. రాజీవ్​ గృహకల్ప విలంగుల కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అపార్టుమెంట్​లోని ఓ ఇంట్లో చిక్కుకున్న ఐదుగురు బాధితులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. కల్వోడ్డు వెంకటేశ్వరనగర్​లోని ఓ ఇంటిని వరద చుట్టుముట్టడంతో ఇంటిపైకి ఎక్కి ఏడుగురు బాధితులు తలదాచుకున్నారు. మోతీనగర్​, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. వందల మంది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు :ప్రకాశ్​ నగర్​ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్​ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్​ నీరబ్​ కుమార్​ ప్రసాద్​తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్టణం నుంచి రెండు హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి.

ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని కాపాడాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలిచ్చారు. ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్చంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే వారికి తాగునీళ్లు, ఆహారం అందించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

పాలేరు వాగు ఉద్ధృతి, దంపతులు గల్లంతు : పాలేరు వాగు వరద ఉద్ధృతిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. అలాగే కూసుమంచి మండలం నాయకన్​గూడెంలో ఓ కుటుంబం గల్లంతు అయింది. నాయకన్​గూడెంలో వరదకు యూకుబ్​, సైదా, షరీఫ్​ కొట్టుకుపోయారు. వాగులో కొట్టుకుపోతున్న బాలుడిని స్థానికులు కాపాడారు. కానీ దంపతులు మాత్రం గల్లంతు అయ్యారు. ఉదయం వారి ఇంటిని వరద చుట్టుముట్టింది. ప్రాణాలు కాపాడుకునేందు గోడ ఎక్కి, బాధితులు సాయం కోసం ఎదురు చూశారు. డ్రోన్​ ద్వారా బాధితులకు లైఫ్​ జాకెట్లును అధికారులు అందించారు. ఆ తర్వాత దంపతులు కనిపించకుండా పోయారు.

రాకాసి తండాను చుట్టుముట్టిన ఆకేరు వాగు : మరోవైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాసితండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రాకాసితండాను ఆకేరు వాగు వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఈ తండాకు ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు చేరుకున్నాయి. తండావాసులను కాపాడేందుకు ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్​ చర్యలు సాధ్యపడడం లేదు. బోట్ల సహాయంతో తండావాసులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. తండాలో ఇళ్లపై నిల్చున్న 30 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్​ఎఫ్​ బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాను వణికిస్తున్న వరుణుడు - కోదాడలో వరద నీటిలో 2 మృతదేహాలు లభ్యం - Heavy Rains in Nalgonda District

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi

Last Updated : Sep 1, 2024, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details