Brother In Law Murder In Sangareddy : మతిస్థిమితం లేని బావ పేరు మీద బావమరిది జేసీబీని కొనుగోలు చేశాడు. అలాగే బావ పేరు మీద పోస్టల్ బీమా కూడా చేయించాడు. బావను హత్య చేస్తే బీమా డబ్బులు వస్తాయని, జేసీబీ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుందని పన్నాగం పన్ని స్నేహితుడితో కలిసి సొంత బావనే హత్య చేశాడు. ఆ తర్వాత సాధారణ మృతి కింద నమ్మించే యత్నం చేశాడు. పోలీసులు అనుమానం వచ్చి లోతుగా విచారించడంతో అసలు బండారం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్ల తండాకు చెందిన గోపాల్ నాయక్ (42) తన కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసముంటున్నాడు. గోపాల్నాయక్కు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. అయితే శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గోపాల్ నాయక్ కనిపించడం లేదని వెతుకుతుండగా అమీన్పూర్లోని శ్మశాన వాటిక వద్ద చనిపోయి ఉన్నాడు. దీంతో అతని కుమారుడు సుధీర్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్మశాన వాటిక వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఏం లేకపోయినప్పటికీ, మృతుని బామ్మర్ది నరేశ్పై అనుమానం రావడంతో పోలీసులు విచారించారు.