Benefits Of Employment Card : పలు రంగాల్లో జాబ్లు పొందేందుకు ఉపాధి కార్డులు ఊతంగా నిలుస్తున్నాయి. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన నిరుద్యోగ యువత వద్ద ఈ కార్డులుంటే వారికి మొదటి ప్రాధాన్యమిస్తున్నాయి. అవగాహనలేమితో పలువురు పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం లేదు. దీంతో ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం శాశ్వత కార్డులను జారీ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అధిక సంఖ్యలో నమోదు చేసుకోవాలని ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి కోరుతున్నారు.
కళాశాలల్లో అవగాహన : విద్యార్థులకు మరింత చేరువై వారి పేర్ల నమోదుకు డిగ్రీ, పీజీ కళాశాలల్లో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం( జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్లు) మేళాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ కెరియర్ డాటా సర్వీసెస్లో పేర్లు నమోదవుతాయి. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాలకు పిలుపు అందుతుందని అధికారులు చెబుతున్నారు.
24 గంటల్లోనే ఉపాధి కార్డు అందజేత : గతంలో ఒకసారి కార్డును తీస్తే వాటిని తిరిగి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుండేది. ప్రస్తుతం వాటి స్థానంలో శాశ్వత కార్డులను అందజేస్తున్నారు. దీనిపై నిరుద్యోగ యువతకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే వారికి ఉపాధికార్డులు లేకపోతే అప్పటికప్పుడు దరఖాస్తు తీసుకొని ఒక్క రోజులోనే శాశ్వత కార్డులను అందిస్తున్నారు.
స్మార్ట్ఫోన్తోనూ చేసుకోవచ్చు : ఉపాధికార్డుకు ఆఫ్లైన్తో పాటు, ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సమీపంలోని మీసేవా కేంద్రం వద్ద లేదా సెల్ఫోన్లో www.employment.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి. నేరుగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కరీంనగర్లోని కశ్మీర్గడ్డ అగ్నిమాపక కేంద్రం సమీపంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో విద్యార్హతల జిరాక్స్లను దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ.
సద్వినియోగం చేసుకోవాలి : సింగరేణి, ఆర్టీసీ తదితర సంస్థల్లో ఉద్యోగ అకాశాలకు ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలి. 24 గంటల్లోనే ఈ కార్డులను జారీ చేస్తున్నాం. వీటికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే నగరంలోని ప్రాంతీయ ఉపాధి శాఖ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలి.
పరీక్ష లేకుండానే నెలకు రూ.లక్ష జీతంతో జాబ్ - వెంటనే అప్లై చేసుకోండి
పోస్టల్ డిపార్ట్మెంట్లో 21,413 ఉద్యోగాలు - పరీక్ష రాయకుండానే జాబ్ - చివరి తేదీ ఎప్పుడంటే?