School Students Facing Problems :ప్రభుత్వంపై నమ్మకంతో సర్కారు బడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తుంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానా అవస్థలు ఎదుర్కొంటూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెండు గదులలో 162 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్య అందడం లేదు. విద్యార్థులకు సరైన పాఠాలకు నోచుకోని ఆ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక కథనం.
విద్యార్థులకు తప్పని తిప్పలు :జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ సర్కారు బడిలో 162 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో కేవలం రెండు గదులే ఉండడంతో విద్యార్థులు చదువులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో సగం తరగతి మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువాను అడ్డుగా పెట్టుకొని కొనసాగిస్తున్నారు. రెండు తరగతులను వరండాలో నడిపిస్తుండగా మరో తరగతికి చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్నారు.
ఇరుకు గదుల్లోనే పాఠాలు వింటున్న విద్యార్థులు :పాఠశాలలో విద్యార్థులందరూ ఇరుకైన గదిలో ఇబ్బంది పడుతూ కూర్చుని పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠం అర్థం కాక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు సరిగా బోధించలేకపోతున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే అదనపు తరగతి గదులు నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.