తెలంగాణ

telangana

YUVA : గిరిజన బిడ్డకు బాంబే ఐఐటీలో సీటు - కోచింగ్‌ తీసుకోకుండానే జేఈఈ ఫలితాల్లో ర్యాంకు - Khammam JEE Ranker Navya Story

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 4:39 PM IST

Khammam JEE Ranker Navya Story : దేశంలోని ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్ విద్య ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ. లక్షలమంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు పోటీపడతారు. చాలామంది విద్యార్థులు ప్రత్యేక కోచింగ్ తీసుకుని మరీ కుస్తీ పడతారు. అయినా, సీటు సాధించేది కొద్దిమంది మాత్రమే. అలాంటి పోటీ పరీక్షల్లో ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా సత్తాచాటిందా అమ్మాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివి, ఐఐటీ బాంబేలో సీటు సాధించిన గిరిజన విద్యార్థిని నవ్య చదువుల ప్రయాణం ఇది.

Navya Got IIT Seat Without any Coaching
Khammam JEE Ranker Navya Story (ETV Bharat)

Tribal Student Got a IIT Bombay Seat : చదువుల్లో రాణించాలనే పట్టుదల ఉంటే సదుపాయలు లేకున్న సాధ్యమవుతుందని నిరూపించింది ఈ అమ్మాయి. కుటుంబానికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివింది. ఆర్థిక కష్టాలతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి చదువుల్లో రాణించాలనే పట్టుదల పెంచుకుంది. ఆ పట్టుదలతోనే అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒకటైన బాంబే ఐఐటీలో సీటు సాధించింది ఈ అమ్మాయి.

ఈ అమ్మాయి పేరు బానోత్‌ నవ్య. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గంగబండ తండా స్వస్థలం. తండ్రి మోతీలాల్ చిరుఉద్యోగి. తల్లి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వీళ్లది గిరిజన రైతు కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాంతో స్థానికంగా ఉన్న మండల పరిషత్తు ప్రాథమికపాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించింది నవ్య.

పది, ఇంటర్‌ ఫలితాల్లో మెుదటి శ్రేణి మార్కులతో సత్తా : ప్రాథమిక విద్య తెలుగులో అభ్యసించి, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియానికి మారడంతో మెుదట్లో చాలా కష్టపడింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులకు సాయం చేస్తూనే ఆంగ్లంపై పట్టు పెంచుకుంది. దాంతో పదో తరగతిలో 9.5 గ్రేడ్ సాధించింది నవ్య. తర్వాత గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చేసి 964 మార్కులు సాధించింది ఈ విద్యాకుసుమం.

"నా స్కూల్​ స్థాయి నుంచి నేను అన్నింటిలో ఫస్ట్​ వచ్చాను. దానిఫలితంగా నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు కెనరా బ్యాంకు వాళ్లు నా చదువుకు సంబంధించి స్పాన్సర్షిప్ చేసి, నాకు సపోర్ట్ చేశారు. ఇంటర్​లో చేరగానే అక్కడ అంతా ఐఐటీ సిలబస్ ఉండేది, దానికి సంబంధించి కూడా మా టీచర్లు కొన్ని బుక్స్​ ఇచ్చారు."-బానోతు నవ్య, విద్యార్థిని

కోచింగ్‌ తీసుకోకుండానే జేఈఈ ఫలితాల్లో ర్యాంకు :గురుకులంలో ఇంటర్ చదువుతూనే, ఇంకోవైపు జేఈఈ ప్రవేశపరీక్షల కోసం కృషి చేసింది నవ్య. రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ రోజుకు 16 గంటలు చదివింది. అధ్యాపకులు నేర్పిన మెలకువలు తన సాధనకు సాయపడ్డాయి. తోటి స్నేహితుల నుంచి పోటీ తనలో మరింత పట్టుదల పెంచాయి. అవే జేఈఈ ప్రవేశపరీక్షలో రాణించడానికి దోహదపడ్డాయని చెబుతోంది.

తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఐఐటీలో సీటు సాధించానని గర్వంగా చెబుతోంది నవ్య. తమకి చేదోడుగా ఉంటూనే, చదువుల్లో రాణించింది. మేము పడుతున్న కష్టాన్ని చూసి పట్టుదలతో సాధన చేసి బాంబే ఐఐటీలో సీటు సాధించడం మాకెంతో గర్వంగా, ఆనందంగా ఉందంటున్నారు నవ్య తల్లిదండ్రులు.

"మా అమ్మాయి చదువుల్లో ఈ స్థాయిలో రాణించినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. నాకు ఎంతో మంది టీచర్లు, ఇతర వ్యక్తులు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతుంటే, ఎంతో గర్వంగా ఉంది. ఇంకో నాలుగు సంవత్సరాలు అమ్మాయిని ఇలానే చదివిస్తే, ఎంతో ఉన్నతికి ఎదుగుతుందని. ఇలాంటి అమ్మాయిని కన్నందుకు మీరు అదృష్టవంతులు అంటుంటే నా కళ్లంట నీళ్లు తిరుగుతున్నాయి."- మోతీలాల్, నవ్య తండ్రి

Tribal Student Got a IIT Bombay Seat : గిరిజన అమ్మాయిగా నాన్న నమ్మకం నిలబెడుతూ, బాంబే ఐఐటీలో సీటు సాధించడం ఆనందంగా ఉందని చెబుతోంది నవ్య. ఇంజినీరింగ్‌లో మెటలార్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్‌ విభాగం ఎంచుకుంది. భవిష్యత్తులో ఐఏఎస్ అయ్యి, సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా చెబుతోంది నవ్య.

YUVA : ఆటలతో పాటు చదువులో సత్తా చాటుతున్న నల్గొండ యువతి - పీఈసెట్​లో టాప్ ర్యాంక్ - Sadhya Got First Rank in PECET

YUVA : వైకల్యాన్ని జయించి - ఐఐఎం ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన యువతి - student excelled in IIM entrance

ABOUT THE AUTHOR

...view details