ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 1:05 PM IST

ETV Bharat / state

'కళింగపట్నం' ఆగిపోయింది! - రైతన్నలకు కన్నీరు మిగిల్చిన వైఎస్సార్సీపీ

Kalingapatnam lift Irrigation: సముద్రానికి సమీప ప్రాంతాలవి. పక్కనే నది ప్రవహిస్తున్నా తమ పంట పొలాలకు సాగునీరు రాని దుస్థితి. ఆ గడ్డు పరిస్థితులను రూపుమాపడానికి టీడీపీ ప్రభుత్వం కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అది పూర్తైతే తమ పంట చేలకు సాగునీరు వస్తుందని ఆశపడిన రైతన్నకు నిరాశే మిగిలింది.

Etv Bharatkalingapatnam_lift_irrigation
Etv Bharatkalingapatnam_lift_irrigation

'కళింగపట్నం' ఆగిపోయింది! - రైతన్నలకు కన్నీరు మిగిల్చిన వైఎస్సార్సీపీ

Kalingapatnam lift Irrigation: పంట పొలాల మధ్య పుష్కలమైన నీటి వనరులతో నది పారుతోంది. కానీ, నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా పంట పొలాల్లోకి చేరని దుస్థితి, ఆ నదికి వరదలు వచ్చి పొంగి పంటలు కొట్టుకుపోవడమే తప్ప సాధారణ రోజుల్లో చుక్కనీరు అందని దయనీయ పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అనేక గ్రామాల్లో వంశధార పక్కనే ఉన్నా రైతులకు కన్నీటి గాథే ఇది.

కళింగపట్నం ఎత్తిపోతల ద్వారా సమస్యకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది. కానీ, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్​సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో కళింగపట్నం ఎత్తిపోతల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాల్లో ఏడాదిలో 2 పంటలు పండించేందుకు వీలుంది. అయితే గత నాలుగేళ్లుగా ప్రధాన కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో చివరి ప్రాంత భూములకు నీరందడం కష్టమవుతోంది. వానలు సరిగా పడితేనే కాలువల చివరి ఆయకట్టు ప్రాంతాల్లోని పంటలకు నీరు అందుతుంది. లేకపోతే ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సాగునీరు అందక రైతులు నష్టపోవాల్సింది.

కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటూ తెదేపా నేతల నిరసన

గార మండలంలో వమరవల్లి, తోణంగి, కళింగపట్నం, కొర్లాం, కొమరివానిపేట పంచాయతీల్లో వంశధార ఆయకట్టు చివరి భూములు. సుమారు 2 వేల 200 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ఆయకట్టుకు సంవత్సరం పొడవునా నీరు అందాలనే ఉద్యేశంతో, 2018లో గత టీడీపీ ప్రభుత్వం కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. 2.75 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించిన ఈ పనులను అప్పటి ప్రభుత్వం 80 శాతం పనులను పూర్తి చేసింది.

అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్​సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎత్తిపోతల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నాలుగేళ్లు గడుస్తున్నా, ఆ పనుల వంక కన్నెత్తైనా చూడటం లేదు. దీంతో సాగునీరు అందక రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం - వేల ఎకరాల్లో బీళ్లుగా మారిన పంట పొలాలు

గార మండలంలోని గ్రామాలన్నీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండటంతో, అక్కడి ప్రజలు తాగునీటికి, సాగు నీటి అవసరాలకు వంశధార నదిపైనే ఆధారపడుతుంటారు. అయితే ప్రస్తుతం నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని పరిసర గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమకు తాగునీటి సమస్య ఏర్పడుతోందని వాపోతున్నారు.

స్థానిక మంత్రి ధర్మాన ప్రసాదరావుకు తమ సమస్యపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు స్పందించి, కళింగ ఎత్తిపోతల పథకంపై దృష్టి పెట్టి మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యవసాయం మానేయాల్సిందే - బతకడం కూడా కష్టమే : ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

"పంటకాలం ప్రారంభమయ్యే సరికి కాలువల నిర్వహణ సరిగా లేక మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. గారలోని పెద్ద చెరువుకు నీరు అందించాలని విన్నవించుకున్నాం. వారు కూడా నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ నీటి మీద రాతల్లాగే మిగిలి పోయాయి." - వెంకట అప్పరావు, రైతు

"వరదల వల్ల మేము ప్రతి సంవత్సరం నష్టపోతున్నాం. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేద్దామనే భావన ప్రభుత్వానికి లేదు. స్థానిక మంత్రి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. కానీ, ఆయనే రైతులను పట్టించుకోవడం లేదు." -సూరిబాబు స్థానికుడు

Crops Drying in Nellore Due to lack of Kandaleru Lift Irrigation Water: వ్యవసాయ మంత్రి నియోజకవర్గంలో రైతు కంట కన్నీరు.. పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన

ABOUT THE AUTHOR

...view details