Irregularities in ESI by Purchasing More Medicines: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల వరకు ఉన్న ఈఎస్ఐ చందాదారులకు 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, నాలుగు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. వైద్యసేవల ఖర్చులో కేంద్ర ప్రభుత్వానిదే అత్యధిక వాటా. డిస్పెన్సరీలకు మందులు కొనుగోలు చేసే బాధ్యతలను సెంట్రల్ డ్రగ్స్ సెంటర్లకు అప్పగించారు. వీటికి హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు ఇన్ఛార్జులుగా ఉన్నారు. నాలుగో త్రైమాసికానికి ఆస్పత్రులు, డిస్పెన్సరీల నుంచి సూపరింటెండెంట్లు మందుల ఇండెంట్లు తీసుకున్నారు. అదనంగా 10 శాతం మందుల కొనుగోలుకు అనుమతివ్వాలంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు.
10 శాతం వెనుక భారీ ప్లాన్: మూడో త్రైమాసికంలో ఈ ఆస్పత్రికి 3 కోట్ల రూపాయల విలువైన మందులు సరఫరా చేశారు. నాలుగో త్రైమాసికంలో ఇంకా ఎక్కువ ఇండెంట్ పెట్టాలంటే రూల్స్ ప్రకారం కుదరదు. ఈఎస్ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్ కలిసి వైద్యశిబిరాలు నిర్వహించాలని కార్పొరేషన్ ఆదేశించిందని, తరచూ శిబిరాల నిర్వహణ, ఓపీ రోగులు పెరిగినందున గత సంవత్సరం కంటే 10 శాతం అదనంగా మందులు ఆర్డర్లు పెట్టేందుకు అనుమతివ్వాలంటూ సూపరింటెండెంట్ లేఖ రాయగానే ఉన్నతాధికారులు ఆమోదించేశారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 18.5 కోట్ల రూపాయల విలువైన మందులు కొన్నారు. అందులో చాలావరకు డిస్పెన్సరీలు, ఆస్పత్రులు ఉన్నాయి. మార్చి నెలాఖరుతో 2023-24 బడ్జెట్ అయిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున ఇప్పుడే సాధ్యమైనంత ఎక్కువ మందులు కొనిపించి, కమీషన్లు కొట్టేయాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు.