తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరండి' - సీనియర్​ ఐఏఎస్​లకు హైకోర్ట్​ ఆదేశం - IAS OFFICERS PETITION IN HIGHCOURT

మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దు - స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదు : హైకోర్టు

IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC
IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 12:19 PM IST

Updated : Oct 16, 2024, 6:48 PM IST

IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC : డీవోపీటీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. తెలంగాణలో పనిచేస్తున్న వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిని ఏపీకి, అక్కడ పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఇటీవల కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, డీవోపీటీ ఆదేశించింది. డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకపోవడంతో.. ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ఆలిశెట్టి ధర్మాసనం విచారణ జరిపింది.

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందని ఐఏఎస్​ల తరఫున న్యాయవాదులు వాదించారు. గత పదేళ్ల అనుభవాన్ని ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వ్యక్తిగతంగా ఐఏఎస్​ల అభ్యంతరాలు, వినతులను వినాలన్న ఆదేశాన్ని కూడా పట్టించుకోలేదని వాదించారు. కనీసం ఏకసభ్య కమిటీ నివేదికను కూడా తమకివ్వలేదని ఐఏఎస్​లు వాదించారు. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు తమను రిలీవ్ చేయవద్దని కేంద్రాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు. నవంబరు 4న క్యాట్ తదుపరి విచారణ ఉన్నందున, కనీసం అప్పటి వరకైనా ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరండి : మరోవైపు అధికారులను రిలీవ్ చేసేందుకు 15 రోజులు సమయం ఇవ్వాలని మంగళవారం తెలంగాణ, ఇవాళ ఏపీ డీవోపీటీని కోరాయి. ఏపీ, తెలంగాణ లేఖలను హైకోర్టుకు ఐఏఎస్ అధికారులు సమర్పించారు. ఐఏఎస్ అధికారుల వాదన సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలని పరిపాలన వ్యవస్థ నిర్ణయిస్తుందని.. కోర్టులు జోక్యం చేసుకోవద్దన్నారు. స్టే ఇవ్వకూడదన్న క్యాట్ నిర్ణయం సరైనదేనని కేంద్రం వాదించింది. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలన్న తమ ఉత్తర్వులు ఏ విధంగా సమర్థనీయమో పూర్తి వివరాలతో క్యాట్​లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఏఎస్​జీ తెలిపారు. వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అన్న హైకోర్టు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా అని ఒక దశంలో అభిప్రాయం అడిగింది. అయితే వివాదం తర్వాత తేలుతుంది కానీ, ముందయితే అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రంలో చేరాలని పేర్కొంది. బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని వ్యాఖ్యానించింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్​లను ప్రశ్నించిన క్యాట్​

క్యాట్​ను ఆశ్రయించిన ఐఏఎస్​లు - ఆమ్రపాలి సహా నలుగురు​ పిటిషన్​ దాఖలు

Last Updated : Oct 16, 2024, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details