తెలంగాణ

telangana

ETV Bharat / state

'సెల్‌ఫోన్‌-చైన్‌' చోరులకు చెక్‌ - డెకాయ్‌ ఆపరేషన్లతో దొంగల భరతం పడుతున్న పోలీస్​ బృందాలు - Hyderabad Police Operation Decoy - HYDERABAD POLICE OPERATION DECOY

Special Decoy Operations in Telangana : రాష్ట్ర రాజధానిలో గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, అసాంఘిక శక్తులు, దోపిడీ దొంగలను కట్టడి చేసేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డెకాయ్‌ ఆపరేషన్ల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ఆయా బృందాలు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ అధికం చేశారు. వారిని అదుపు చేసేందుకు అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు సంచలనం సృష్టించాయి.

Special Operation Decoy
Special Operation Decoy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:24 AM IST

Updated : Jun 23, 2024, 10:32 PM IST

Hyderabad Police Decoy Operation : మహా నగరంలో రాత్రివేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని ముమ్మరం చేశారు. దొంగలు, స్నాచర్లు, అసాంఘిక శక్తులను మాటు వేసి పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం డెకాయ్‌ ఆపరేషన్‌ల బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కూడా సిబ్బంది, అధికారుల పనితీరును రాత్రి వేళల్లో ఆకస్మికంగా పరిశీలిస్తున్నారు. వివిధ ఠాణాల్లో అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల పర్యటనతో అప్రమత్తమయ్యారు.

నగరంలో సెల్‌ఫోన్‌ స్నాచర్లు హల్‌చల్‌ చేస్తున్నారు. పాదచారులు, ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్‌ ఫోన్లు లాక్కొని పారిపోతున్నారు. ఒక్కో బృందంలో స్థానిక పోలీస్​ స్టేషన్​ కానిస్టేబుల్, ఇద్దరు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లుంటారు. ప్రజల మధ్య సివిల్‌ దుస్తుల్లో ఉంటూ గొలుసు దొంగలు, సెల్‌ఫోన్‌ స్నాచర్లను కట్టడి చేయటమే ఈ బృందాల బాధ్యత. రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాపులు, రైల్వేస్టేషన్లపై నిఘా ఉంచి సెల్​ఫోన్​ స్నాచర్లను కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక బృందం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలుగడ్డ బావి వద్ద డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

తమ ప్లాన్​లో భాగంగా ముగ్గురూ తమ చేతుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకొని వీడియోలు చూస్తున్నారు. సుమారు 2 గంటల సమయంలో అదే మార్గంలోకి వచ్చిన నలుగురు యువకులు ఆ ముగ్గురి వద్ద సెల్‌ఫోన్లు కొట్టేసేందుకు చక్కర్లు కొట్టారు. అదను చూసి ఒక కానిస్టేబుల్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ముగ్గురు కానిస్టేబుళ్లు నలుగురు స్నాచర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. సినీ ఫక్కీలో నిందితులను వెంటాడి పట్టుకున్నారు. తప్పించుకునేందుకు నలుగురు నిందితులు కానిస్టేబుళ్లపై దాడికి దిగారు.

ఆత్మ రక్షణ కోసం కాల్పులు : దీంతో ప్రాణరక్షణ కోసం ఆ బృందంలోని ఒక కానిస్టేబుల్‌ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు అక్కడకు చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా తార్నాక, లాలాగూడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతూ, ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలతో ఈ నలుగురికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

వివిధ పోలీస్‌స్టేషన్‌లలో రాత్రివేళలో సిబ్బంది, అధికారులు ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవడానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే సీపీ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం రాత్రి మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, ఫలక్‌నుమా, ఆసిఫ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది పనితీరు, రాత్రివేళల్లో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల సన్నద్ధతను పరిశీలించారు. రాత్రి సమయాల్లో ఠాణాకే పరిమితమైన ఒక ఇన్‌స్పెక్టర్‌ను సీపీ మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపానికి చేరిన సీపీ వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం.

పోలీసుల మీదే దాడికి యత్నం : దీంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కిందకు దిగారు. కారులోని వారికి ఏమైనా గాయాలయ్యాయా అని పరిశీలిస్తున్న సమయంలో ఒక గుంపు పోలీసులు ఉన్న వైపు పరుగులు తీశారు. అరుపులు కేకలతో పోలీసుల మీదకే దాడికి తెగబడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హఠాత్తుగా ఎదురైన పరిణామంతో స్పందించిన పోలీసులు రెండు, మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి దాడికి తెగబడిన గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. మొత్తానికి పోలీసులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియంత్రించారు.

నగర సీపీ సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొంతకాలంగా సౌత్‌వెస్ట్‌ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న నేరాలను కట్టడి చేయటంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. పక్క ఠాణా పరిధిలో నేరాలు జరుగుతున్నాయని అజాగ్రత్తగా ఉండొద్దని, ముందుగానే మేల్కొని బందోబస్తు, గస్తీ పెంచుకోవాలన్నారు. రాబోతున్న పండుగల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించినట్లు సమాచారం.

నేపాలీ దొంగల ముఠా - నమ్మారో ఇల్లు గుల్ల! - Nepali thieves

సెల్​ఫోన్​ చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్ - రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు స్వాధీనం

Last Updated : Jun 23, 2024, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details