తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకాశం జిల్లాకు ఆకస్మిక వరదల ముప్పు - స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు - ప్రకాశం జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక - పాఠశాలలు, కళాశాలలకు సెలవు

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Etv BharatHEAVY RAINS IN ANDHRA PRADESH
FLASH FLOODS IN PRAKASHAM (ETV Bharat)

Heavy Rains in Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 440 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు వివరించింది. పుదుచ్చేరికి 460 కిలో మీటర్లు, నెల్లూరుకు 530 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే క్రమంలో ప్రకాశానికి ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు పొంచి ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతంలోని ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో భారీ వర్షం నమోదవుతుందని ప్రకటించింది.

విద్యాసంస్థలకు సెలవు: దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా, మండల అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. విపత్తులను ఎదుర్కొనేలా తీరప్రాంత మండలాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు 33 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అయిదు కేంద్రాల్లోకి 214 మందిని తరలించి భోజన వసతి కల్పించారు. వర్షాల దృష్ట్యా వరుసగా మూడో రోజైన బుధవారం కూడా పాఠశాలలు, కళాశాలలకు ప్రకాశం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సెలవు ప్రకటించారు.

అల్పపీడన ద్రోణితో అల్లకల్లోలంగా మారిన కోస్తా జిల్లాలు - ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్

తీర ప్రాంత గ్రామాల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల మేర బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు నివారించేందుకు 700 స్తంభాలను విద్యుత్తు శాఖ అధికారులు సిద్ధం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు 300 మంది కార్మికులను సమాయత్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన మందులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాలకు సమన్వయంతో తరలించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నగర పరిధిలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా యంత్రాలతో పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అందించిన సమాచారం మేరకు అర్థవీడు, పెద్దదోర్నాల, కంభం, పెద్దారవీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

15వేల కుటుంబాలపై ప్రభావం: ఐదు తీరప్రాంత మండలాల్లోని 15 వేల కుటుంబాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాతో నిత్యావసర సరకులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, లీటరు పామోలిన్‌ను పంపిణీ చేయడానికి ఆయా చౌక ధరల దుకాణాలకు తరలించారు.

ఈ నెల 16న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు తీర ప్రాంత మండలాల్లోని 18 గ్రామాలపై, మొత్తం 54 ఆవాస ప్రాంతాల్లోని 56,584 మందిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 30 మందితో కూడిన రాష్ట్ర విపత్తు నిర్వాహాణ బృందం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు.

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నెల్లూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు వర్షాలపై నివేదించాలని సీఎంవోకు సూచించారు.

ఏపీకి డెంజర్​ బెల్స్​ - ఆ జిల్లాలకు వాన'గండం'

ఏపీలో అల్పపీడనం ఎఫెక్ట్​ - రేపు ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

ABOUT THE AUTHOR

...view details