Electricity Ambulance Service in Hyderabad :మనుషులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ సేవల కోసం అత్యవసర వాహనాలు (అంబులెన్స్లు) వస్తాయన్న విషయం అందరకూ తెలిసిందే. పశువులకు కూడా ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి పవర్ కట్ అయినా అంబులెన్స్లు వస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ అంబులెన్స్ తరహాలో స్పెషల్ వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతే, ఎమెర్జెన్సీ విద్యుత్ సేవల పునరుద్ధరణకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ఆధ్వర్యంలో ద్వారా ‘విద్యుత్ అంబులెన్సు’లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. నెక్లెస్రోడ్డులో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ వెహికల్స్ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యేక వాహనాలు ప్రారంభించామని తెలిపారు.
విద్యుత్ అంబులెన్సులలో ఉండే సాధారణ పరికరాలు : విద్యుత్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఈ వాహనాల్లో వస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో 57 సబ్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్కు ఒక స్పెషల్ వెహికల్ను కేటాయించామన్నారు. అంబులెన్సులో ఒక అసిస్టెంట్ ఇంజినీరు, ముగ్గురు లైన్మెన్లు అవసరమైన మరమ్మతు పరికరాలతో 24 గంటలూ రెడీగా ఉంటారని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ను కూడా ఈ వాహనంలో తీసుకెళ్లగలరని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్రెడ్డి సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు.