Vizag Honey Trap Case Updates : ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. ఈ కోవలోకే విశాఖ ఘటన వెలుగులోకి రావడంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
వలపు వలపన్ని పలువురిని మోసం చేసిన ఘటనలో మాయలేడి జాయ్ జమీమాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కిలేడీ జమీమా ఎత్తుగడలతో పాటు ఇతర కీలక అంశాలను వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన వారు, సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా నిందితురాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.
సామాజిక మాధ్యమాలే టార్గెట్ :సామాజిక మాధ్యమాల వేదికగా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని సీపీ శంఖబ్రత బాగ్చీపేర్కొన్నారు. ఈ జాయ్ హనీట్రాప్ వెనుక పెద్ద రాకెట్ ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. తొలుత అందమైన అమ్మాయి ఫొటోలతో యువకులకు ఎర వేస్తారని తెలిపారు. ఆ తర్వాత బాధితులను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తారని వివరించారు. ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీస్తారని సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.