HYDRA Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. అలాగే హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని రంగనాథ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పవని స్పష్టం చేశారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదని చెప్పారు. పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూకట్పల్లిలోని కావలి చెరువు ప్రాంతాలను పరిశీలించారు. కూకట్పల్లి రాఘవేంద్ర కాలనీ, కాముని చెరువు స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన పరిశీలించారు. కాముని చెరువు కింద భాగంలో ఉన్న మైసమ్మ చెరువు వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలను, నాలా మళ్లింపు స్థలాలను ఆయన పరిశీలించారు. నాలా మళ్లింపు చేసి రిటైనింగ్ నిర్మించకపోవడంతో ఆయన నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల లోపల రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, ఒకవేళ అలా నిర్మాణ పనులు చేపట్టకపోతే చర్యలు తప్పని హెచ్చరించారు.
చెరువుల సుందరీకరణ తొందరగా పూర్తి చేయాలి :చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువు ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తోందన్నారు.