తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ 6 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్​ స్పెషల్​ ఫోకస్ - 2025 మార్చి నాటికి పూర్తయ్యేలా ఆదేశాలు జారీ - CM Revanth on Irrigation Projects

CM Revanth Reddy on Projects Review : రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్​లపై సీఎం రేవంత్​ రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, 2025 మార్చి నాటికి నూటికి నూరు శాతం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 9:29 PM IST

CM Revanth Special Focus on Irrigation Projects
CM Revanth Reddy on Projects Review (ETV Bharat)

CM Revanth Special Focus on Irrigation Projects : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగు నీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు.

ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలి :అటు గోదావరి బేసిన్​తో పాటు, ఇటు కృష్ణా బేసిన్​లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్​ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే వదిలేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు అధికారులు వివరించారు. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి.

CM Revanth Review on Six Irrigation Projects :ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్​లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

2025 మార్చి నాటికి నూటికి నూరు శాతం పనులు పూర్తి చేయాలి :ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, సుమారు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం అంచనాలు రూపొందించింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నీలంవాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ -2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సమాజంలో మార్పు - జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ - ISKCON Temple Jagannath Rath Yatra

విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం - తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయం - TG CM REVANTH AND AP CM CBN MEETING

ABOUT THE AUTHOR

...view details