CM Revanth Reddy Meeting on BC Reservations : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోకుండా, త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై పట్టిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. సందేహాలు ఉంటే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సీఎం సూచించారు.
త్వరగా నివేదిక ఇవ్వండి : ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఆయా అంశాలపై త్వరగా నివేదిక తయారు చేస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయతీల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం 2011లో 53 కాలమ్స్తో కుల గణన చేసిందని, దానికి మరో మూడు జోడిస్తే, కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు.