Family Digital Card Program in Secunderabad :ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కుటుంబ డిజిటల్ కార్డు ఇవ్వాలని ఆలోచించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒకే రాష్ట్రం-ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 'రేషన్ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్కార్డు రాదని మాకు అధికారం ఇచ్చారు. కొత్తగా రేషన్కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరం. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచం. డిజిటల్ కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.' అని తెలిపారు.
ఫ్యామిలీ కార్డు ఉంటే రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు : ఫ్యామిలీ కార్డు ఉంటే చాలు రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో 30 శాఖలకు సంబంధించిన సమాచారం ఉంటుందని వెల్లడించారు. మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్ కార్డు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్పులు, తప్పులు చేసిందని విమర్శించారు. ఎలివేటెడ్ కారిడార్కు అనుమతులు తెచ్చిందే తాను అని గర్వంగా చెప్పారు. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్, వరదల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఖాతాల్లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్లు మూసీ పరిధిలోని పేదలకు పంపిణీ చేయాలని వ్యాఖ్యానించారు.
హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం : హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రసంగించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్, హరీశ్రావు, సబిత కుమారుల ఫామ్హౌస్లు కూల్చాలా? వద్దా? చెప్పండని అడిగారు. ఫామ్హౌస్లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్లో మీ భరతం పడతామని హెచ్చరించారు.