తెలంగాణ

telangana

పారాలింపిక్స్​ కాంస్య విజేత దీప్తి జీవాంజికి రూ.కోటి నజరానా, గ్రూప్​-2 ఉద్యోగం - CM Felicitates Jeevanji Deepti

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 7:32 PM IST

Updated : Sep 7, 2024, 11:00 PM IST

CM Revanth Felicitates Jeevanji Deepti : పారాలింపిక్స్​లో సత్తాచాటిన తెలంగాణ బిడ్డ యంగ్ అథ్లెట్ దీప్తి జీవాంజికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు ఆమెకు గ్రూప్​-2 ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదును ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Felicitates Jeevanji Deepti
CM Revanth Felicitates Jeevanji Deepti (ETV Bharat)

CM Revanth Felicitates Jeevanji Deepti :పారాలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకుముందు దీప్తిని సీఎం అభినందించారు. ఆమె కుటుంబ సభ్యులు, కోచ్, నేతలు, అధికారులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

కోటి రూపాయల నజరానా :జీవాంజి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్​లో 500 గజాల స్థలం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీప్తి కోచ్ ఎన్.రమేశ్​కు పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారాలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాట్ ఛైర్మన్​ శివసేనా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

జివాంజీ దీప్తికి కోటి నజరానా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (ETV Bharat)

ఇదీ జీవాంజి దీప్తి ప్రస్థానం :అథ్లెట్​ జీవాంజి దీప్తి స్వగ్రామం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. దీప్తి విజయాల వెనక తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి కృషి అపారం. వారిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం ఉండటంతో ఆమె తండ్రి తల్లడిల్లారు. కుమార్తెకు ఫిట్స్​ వస్తే విలవిలలాడిపోయేవారు. ఒకానొక దశలో దీప్తి క్రీడల్లో రాణించేందుకు వెనకాడవద్దని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేందుకు కూడా లెక్కచేయలేదు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే తపనతో జీవాంజి దీప్తి తిరుగులేని క్రీడాకారిణిగా మారింది. ఒకప్పుడు దీప్తి మానసిక స్థితి చూసి ఇరుగుపొరుగు వారు ఆమెను తరచూ అవహేళన చేసేవారట. వాటన్నింటిని లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ప్రయత్నించి ఏకంగా పారాలింపిక్స్​లో పతకం సాధించి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. కాగా 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని ముద్దాడింది. దీప్తి విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆరోగ్యం బాగాలేక కాంస్యం గెలిచా - నెక్ట్స్ గోల్డ్ మెడల్ పక్కా : దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Reached India

పారాలింపిక్స్​లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ - కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Wins Bronze Medal

Last Updated : Sep 7, 2024, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details