తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 2:40 PM IST

ETV Bharat / state

తెలుగు జాతికి పెద్దన్నలా ఉంటాను - అమరావతిని హైదరాబాద్​ మాదిరి తీర్చిదిద్దుతా : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU ON HYD

AP CM Chandrababu Naidu On Amaravati : పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద సృష్టించి పేదలకు చేర్చేలా తన పాలన ఉంటుందన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతికి తాను పెద్దన్నలా ఉంటానని, హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతానని అన్నారు.

AP CM Chandrababu Press Meet in Tirumala
AP CM Chandrababu Naidu about Five Years Government

పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - సంపద సృష్టించేలా మా పాలన : ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Press Meet in Tirumala :గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.

శ్రీవారు ప్రాణభిక్ష పెట్టారు : అలిపిరి వద్ద క్లైమోర్‌ మైన్స్‌ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని శ్రీ వేంకటేశ్వరస్వామే తనను కాపాడారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని తెలిపారు.

ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని ఎనర్జీని రీఛార్జ్‌ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - కుటుంబంతో కలిసి పూజలు - AP CM CHANDRABABU VISITED TIRUMALA

ఇకపై పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఉండవు :1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రక్షాళన చేశామని, సరికొత్త పాలన ప్రారంభించామని, వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచాలని తెలిపారు.

గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారని, వారిపై అపారమైన గౌరవం ఉందని, వారికి రుణపడి ఉన్నానని, ఐదు కోట్ల మందికి ప్రతినిధినని, రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారని గుర్తు చేశారు. పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇకపై ఉండవని స్పష్టం చేశారు. నేరస్థులను సహించేది లేదని, తిరుమలలో గంజాయి, మద్యం, విచ్చలవిడిగా మార్చారని, శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.

టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం :ఇక నుంచి ఆంధ్రప్రదేశ్​లో ప్రజా పాలన ప్రారంభమైందని చంద్రబాబు వెల్లడించారు. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యమని తెలిపారు. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను పునరుద్ధరించాలని, రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయని, వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. కక్ష సాధింపులు ఉండవని, టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు.

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్‌ఛార్జి ఈవో

ABOUT THE AUTHOR

...view details