Child Marriage Nandigama in Krishna District :ఇంత కాలం మనం మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగిందని ఆ నోట ఈ నోట వినే ఉంటాం. వార్త పత్రికల్లో చదివే ఉంటాం. కానీ మైనర్ అబ్బాయి, మేజర్ అమ్మాయి వివాహం చేసుకున్నారు అనే విషయం ఎక్కడ, ఎప్పుడూ విని, చదివి ఉండరు. ఇలాంటి సంఘటననే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు పెళ్లి చేసుకుని గురువారం ( అక్టోబర్ 24) పెడన పోలీసుస్టేషన్కు వచ్చారు. ఇద్దరిలో వరుడు మైనర్ (19) (పెళ్లికి) కాగా వధువు (18) మేజర్ కావడం గమనార్హం. వధువుకు 18 ఏళ్లు పూర్తి కాగా వరుడికి 19 సంవత్సరాల వయస్సు.
వధువు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, వరుడు ఇంటర్ వరకు చదివి ఆపేశాడు. దీంతో పెడన పోలీసులు అమ్మాయి, అబ్బాయి పెద్దల్ని పిలిపించి చర్చించారు. పెళ్లి విషయంలో అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటే వరకు మైనర్గా పరిగణించాలని చట్టం స్పష్టం చెబుతుందని ఎస్సై జి.సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలా లేదా, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలా అన్న దానిపై ఉన్నత అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.