Harish Rao Comments On Minister Seethakka: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందని ఆక్షేపించారు. తాము పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని అసలు ఏది అబద్ధం అని ప్రశ్నించారు. ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నా గ్రామ పంచాయతీలకు ఇప్పటికి 9 పైసలు కూడా చెల్లించలేదనేది అబద్ధమా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం : కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2100 కోట్ల రూపాయలు నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించింది అబద్ధమా అని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్ధమా అని ప్రశ్నించారు. మాజీ గ్రామ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం చలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అటకెక్కిందని చెప్పడం తాము అబద్ధం చెప్పడమా అని మంత్రి సీతక్కపై ధ్వజమెత్తారు.