Money Fraud By Bihar Gang in Nalgonda : ప్రజలకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశచూపి డబ్బు కాజేస్తున్నారు. ఉన్న నగదును రెట్టింపు చేస్తామని మాయ మాటలు చెప్పి మెుదట కొద్దిపాటి నగదును రెట్టింపు చేసి చూపిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు మారుస్తామంటారు. భారీ నగదు చేతికి రాగానే ఆ డబ్బులతో పరారీ అవుతున్నారు. ఈ తరహాలో నగదును రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న బిహార్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది :నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రామోజు రామాచారి రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించాడు. ఆ సమయంలో బిహార్కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపీ మేస్త్రితో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని నమ్మించాడు. ఈనెల 22న బిహార్కు చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి నరేశ్, బాధితుడు ఇంటికి వెళ్లారు.
డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి :నగదు రెట్టింపు చేస్తామని చెప్పగా రామాచారి తన వద్ద ఉన్న 33 లక్షల రూపాయలను ఇచ్చాడు. వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్ని ఒక బకెట్లో పోసి నగదును ముంచి బయటకు తీసి వాటికి తెలుపు, బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు కట్టారు. ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు.