తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పోస్టులు పెట్టినందుకు రాంగోపాల్ వర్మకు నోటీసులు - విచారణకు హాజరు కావాలన్న పోలీసులు - AP POLICE ISSUE NOTICE TO RGV

రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు - చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆర్‌జీవీపై కేసు

CASE ON RGV IN ANDHRA PRADESH
AP Police Issue Notice to Ram Gopal Varma (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 1:55 PM IST

AP Police Issue Notice to Ram Gopal Varma :సోషల్ మీడియా పోస్టుల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని రాంగోపాల్ వర్మ నివాసానికి వచ్చిన మద్దిపాడు ఎస్​ఐ శివరామయ్య, పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ ఈ మేరకు నోటీసులిచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కించపరిచేలా రాంగోపాల్ వర్మ ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది.

తెలుగుదేశం నేత రామలింగం ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఏపీలో తుళ్లూరులోనూ వర్మపై కేసు నమోదు కాగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ ఫొటోలను ఆర్​జీవీ గతంలో మార్ఫింగ్​ చేసి తన సోషల్​ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు : సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేన పార్టీ నేతలు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021 సెప్టెంబరు 28న, 2024 ఏప్రిల్‌ 22న వైఎస్సార్సీపీ కార్యాలయం వేదికగా పోసాని కృష్ణమురళి పవన్‌ కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారని జనసేన సెంట్రల్‌ ఆంధ్రా జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌ తెలిపారు. ఆ వీడియోలను వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియాలోనూ ప్రచారం చేస్తూ పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్ఠ దెబ్బతీసేలా చేశారని మండిపడ్డారు. పోసాని కృష్ణమురళి, వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు : సామాజిక మాధ్యమంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్​ చేస్తూ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, యర్రంశెట్టి ఈశ్వరి, చెన్నా సత్యవతి, కె.వసంత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.

రామ్​గోపాల్​ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు

ABOUT THE AUTHOR

...view details