ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ప్రజలకు అలర్ట్ - డిసెంబర్​ 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

AP Registration Charges Hike
AP Registration Charges Hike (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 9:54 AM IST

Registration Charges Hike in AP : పట్టణప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్‌ విలువలు, స్ట్రక్చర్‌ విలువలను సవరించాలి. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ ప్రత్యేక రివిజన్‌ పేరుతో విలువలను పెంచి ప్రజలపై ఆర్థికభారాన్ని మోపింది. వీటిపై ప్రస్తుతం పునఃసమీక్ష జరుగుతోంది.

రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్‌ విలువలను డిసెంబర్ 1 నుంచి పెంచాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో అధికారిక ప్రకటన రానుంది. వైఎస్సార్సీపీ అసమర్థ పాలన వల్ల కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ విలువలు బహిరంగ మార్కెట్‌ కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. ఈ లోపాలు సరిదిద్ది స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదికన కొత్త విలువలను సర్కార్ ఖరారు చేస్తుంది.

ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసింది. రిజిస్ట్రేషన్‌ విలువల తీరుపై రెండున్నర నెలల నుంచి రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్‌ సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై విలువల సవరణ కసరత్తు పురోగతిని సమీక్షించారు. విలువల పెంపు, తగ్గింపు ఏయే ప్రాంతాల్లో ఎలా చేయాలన్నదానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఇష్టానుసారం కాకుండా :కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే తగ్గిస్తారు. కారిడార్‌ గ్రోత్, జాతీయ రహదారులు, ఇతర అంశాల ప్రతిపాదికన విలువలు ఖరారుచేస్తామని రెవెన్యుమంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని సర్వే నంబర్లు, వాటి పరిధి, జరిగిన అభివృద్ధి, దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను ప్రత్యేక కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. గత సర్కార్​లో మాదిరిగా కాకుండా విలువల పెంపు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్లు ఉంటుందన్నారు. 2023-24లో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.10,005 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 24 వరకు రూ.5,235.31 కోట్ల ఆదాయం వచ్చిందని అనగాని సత్యప్రసాద్‌ వివరించారు.

మరోవైపు ఏపీలో కొన్ని గ్రామాల్లోనే రీ-సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సెక్రటేరియట్​లో జరిగిన మంత్రుల భేటీలో ఆర్థికశాఖ అధికారులతోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు పాల్గొన్నారు. రెండువారాల్లో మరో అధికారిక సమావేశం జరగబోతుంది. ఆ భేటీలో విలువల పెంపుపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

స్టాంపు పేపర్లకు ఇక కొరత లేదు :గతంలోలాగే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపు పేపర్లను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ-స్టాంపింగ్‌తో పాటు స్టాంపుపేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తామని చెప్పారు. రూ.50, రూ.100 విలువ కలిగిన పదేసి లక్షల స్టాంపు పేపర్ల చొప్పున సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపుతున్నామని వివరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్వహణలో క్రయ, విక్రయదారుల సౌకర్యార్థం సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అనగాని వెల్లడించారు

ముఖ్యంగా కాగిత రహిత పాలనతోపాటు స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ జరిగే విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇంకా పలు మార్పులు తెచ్చేలా సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బ్రిటిష్‌ పోకడలకు స్వస్తి పలికి ఎర్రబల్లలు తొలగించామని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్నేహపూర్వక సేవలు అందించడమే లక్ష్యం: ఆర్పీ సిసోదియా - Sisodia Removed Podium

నిషేధిత జాబితాలో వందలాది లే అవుట్లు - మీ భూములు కూడా ఉంటే చెక్ చేస్కోండి

ABOUT THE AUTHOR

...view details